ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని షామీర్ పేట్ దగ్గర జరుగుతుంది. విజయ శాంతితో పాటు మరికొందరు నటులపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్స్ లోకి రానుంది.
వేగేశ్న సతీష్ దర్సకత్వం లో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం రామానాయుడు స్టూడియోలో ఆఫీస్ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. శ్రీదేవి మూవీస్ సమర్పణలో ఆదిత్య మూవీస్ బ్యానర్ పై ఉమేష్ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
రానా, సాయిపల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందనున్న ‘విరాటపర్వం’ సినిమాకు సంబంధించి ఇటివలే రామోజీ ఫిలింసిటీలో కొన్ని సీన్స్ షూట్ చేసారు. ప్రస్తుతం యూనిట్ బ్రేక్ తీసుకున్నారు. మరో నాలుగు రోజుల్లో మెదక్ లో నెక్స్ట్ షెడ్యుల్ ప్రారంభం కానుంది. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్స్ పై సురేష్ బాబు , సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘డిస్కో రాజా’ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. నభా నటేష్ ,పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ నటిస్తున్న ఈ సినిమాను ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ కంపోజర్.
అల్లు అరవింద్ సమర్పణలో అఖిల్ అక్కినేని బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్ బ్యానర్ లో, బన్నీ వాసు నిర్మిస్తున్న సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.