వేగంగా 50 సినిమాల మార్క్ - TG విశ్వ ప్రసాద్

Tuesday,June 13,2023 - 04:11 by Z_CLU

తక్కువ టైమ్ లో తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. టి.జి. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ మీడియా సంస్థ వరుస ఘన విజయాలతో దూసుకుపోతోంది. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలను నిర్మిస్తోంది. ప్రస్తుతం పదికి పైగా నిర్మాణ దశలో ఉన్నాయి. అలాగే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్’ను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జూన్ 16న ‘ఆదిపురుష్’ విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ ఆదిపురుష్ విశేషాలతో పాటు మరిన్ని విషయాలను మీడియాతో పంచుకున్నారు.

 

‘ఆదిపురుష్’ తెలుగు రైట్స్ తీసుకోవడానికి కారణం?

ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ విజువల్‌గా బాగుంది. ఇది ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని మేము భావించాము. మార్కెట్ లెక్కలు వేసుకుని మంచి ధరకు ఈ సినిమా తెలుగు రైట్స్ ని తీసుకున్నాం. భవిష్యత్ లోనూ టి.సిరీస్ నిర్మించే సినిమాలతో అవగాహన ఉంటుంది. ‘స్పిరిట్’ని కూడా తెలుగులో మేమే విడుదల చేస్తాం.

 

‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ గారు మిమ్మల్ని కుటుంబసభ్యుడు లాంటివారు అన్నారు కదా? ఎలా అనిపించింది?

ఆయన అందరితో మంచిగా ఉంటారు. ఆయనతో అంత మంచి అనుబంధం ఏర్పడటం మా అదృష్టం.

 

నిర్మాతగా మీ ప్రయాణం ఎలా ఉంది?

నేను గతంలోనూ చెప్పాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ని ఒక ఫ్యాక్టరీ మోడల్ లోనే స్టార్ట్ చేశాం. అదృష్టం కొద్దీ మాకు విజయాల శాతం ఎక్కువగానే ఉంది. కానీ సినిమా అనేది ఒక ప్రయాణం. ఇందులో విజయాలు ఉంటాయి, పరాజయాలు ఉంటాయి. అవన్నీ ఆలోచించే ఈ రంగంలోకి అడుగుపెట్టాం. పరాజయం ఎదురైనా అది మళ్ళీ పునరావృతం కాకుండా మరింత కృషి చేస్తాం. పరాజయాల నుంచి కొత్త విషయాలు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి.

 

వేగంగా వంద సినిమాలు నిర్మించడం మీ లక్ష్యమని గతంలో చెప్పారు? ఆ లక్ష్యం సినిమాల నాణ్యతపై ప్రభావం చూపుతుందా?

వేగంగా వంద సినిమాలు నిర్మించాలనేది ఇటీవల పెట్టుకున్న లక్ష్యం. త్వరలోనే మా బ్యానర్ లో 25 సినిమాలు పూర్తవుతాయి. మా మొదటి 25 సినిమాల కోసం మేం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాం. కానీ తదుపరి 25 సినిమాలను వేగంగా ఏడాదిన్నరలో పూర్తి చేసి, 50 సినిమాల మార్క్ ని అందుకుంటాం. ఇప్పటికే నాలుగైదు దాదాపు సినిమాలు పూర్తయ్యాయి, మరో 15 దాకా నిర్మాణ దశలో ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయడం వల్ల క్రియేటివిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు. ఇన్ని సినిమాలు చేయడం వల్ల, విడుదల సమయంలో మాత్రం ఛాలెంజ్ లు ఎదురవుతాయి. మాది ఒక ఫ్యాక్టరీ. మాకు టీం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా.. మంచి సినిమాలను అందించడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటాం.

 

మీరు సొంతంగా నిర్మించిన దానికంటే, ఇతర బ్యానర్స్ భాగస్వామ్యంతోనే ఎక్కువ విజయాలు అందుకున్నట్టున్నారు?

పరాజయాలకు భాగస్వామ్యానికి సంబంధం లేదు. మేం ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన వాటిలో పరాజయంపాలైనవి ఉన్నాయి. అలాగే మేం సోలోగా నిర్మించిన వాటిలోనూ పరాజయం చెందినవి ఉన్నాయి. భాగస్వామ్యంతో చేసినా ఎక్కువ శాతం మా ప్రమేయం ఉంటుంది. కాబట్టి జయాపజయాల్లోనూ మా బాధ్యత ఉంటుంది.

 

ఇతర భాషల్లోనూ తెలుగు సినిమాకి ఉన్న డిమాండ్ మరియు ఓటీటీ రైట్స్ కారణంగా సినిమాలకు ఆదాయం పెరిగింది అంటే ఏకీభవిస్తారా?

దానివల్లే మేం వంద సినిమాలు చేయబోతున్నాం. కేవలం థియేట్రికల్ బిజినెస్ మీద ఆధారపడితే అది సాధ్యం కాదు. ఓటీటీ బిజినెస్ కూడా ఇప్పుడు చాలా కీలకం. అందుకే వచ్చే ఏడాదిన్నరలో 25 సినిమాలు చేస్తామని చెప్పగలుగుతున్నాం.

 

ఆదిపురుష్ టికెట్ బుకింగ్స్ తెలుగులో ఇంకా ఓపెన్ కాకపోవడానికి కారణం?

(జూన్ 14) ఓపెన్ అవుతాయి. తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరల పెంపు గురించి ప్రభుత్వాలతో మాట్లాడటం జరిగింది. రెండు ప్రభుత్వాల సానుకూల స్పందన వచ్చింది. మల్టీప్లెక్స్ లలో ధరల అలాగే ఉంటుంది. సింగిల్ స్క్రీన్స్ లో రూ.50 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. రూ.25 పెంచాలి అనుకుంటున్నాం. ఇతర పంపిణీదారులతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాం. అందుకే కాస్త ఆలస్యమైంది.

 

ప్రతి థియేటర్ లో హనుమంతుడికి ఒక సీటు కేటాయించడం, పలువురు సెలబ్రిటీలు ఉచిత టికెట్లు ప్రకటించడం పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చా?

హనుమంతుడికి ప్రతి థియేటర్ లో ఒక సీటు కేటాయించడం అనేది అది ఆయన పట్ల ఉన్న భక్తికి, గౌరవానికి నిదర్శనం. ఉచిత టికెట్లు అనేది పబ్లిసిటీ స్టంట్ కాదు. ఇలాంటి సినిమాకి తమ వంతుగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వారంతట వారు ముందుకొచ్చి చేస్తున్నారు.

 

ఆదిపురుష్ ముందురోజు పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయా?

ఇప్పటిదాకా అయితే ఆ ఆలోచన లేదు. జూన్ 15న రాత్రి ప్రీమియర్స్ వేయాలనే డిమాండ్స్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వస్తే చెప్పలేం.

 

మీ రాబోయే కొత్త సినిమాల గురించి?

సెట్స్ మీద దాదాపు 15 సినిమాలు ఉన్నాయి. వాటి ప్రకటన, ప్రమోషన్స్ విషయంలో వేటికవే ప్రత్యేక ప్లాన్స్ ఉన్నాయి. పరిశ్రమకు పలువురు కొత్త దర్శకులని కూడా పరిచయం చేయబోతున్నాం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ఎనిమిది, పది వరకు కొత్త దర్శకులతో చేస్తున్న సినిమాలు ఉన్నాయి.

 

మీ 50 వ సినిమా గురించి చెప్పండి? అది హాలీవుడ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చా?

మా 25వ సినిమా ‘బ్రో’. మా 50 వ సినిమా ప్రకటన అనేది మరో ఆరు నెలల్లో ఉండొచ్చు. ఇంత తక్కువ సమయంలో హాలీవుడ్ ప్రాజెక్ట్ అనేది సాధ్యంకాదు. వచ్చే రెండు మూడేళ్ళలో హాలీవుడ్ సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకోసం అక్కడి టెక్నీషియన్స్ ని తీసుకుంటున్నాం. త్వరలో పాన్ వరల్డ్ సినిమాలు నిర్మించాలనేది మా లక్ష్యం.

 

ప్రభాస్-మారుతి తో సినిమా చేస్తున్నారు కదా.. అంత పెద్ద సినిమాని అధికారికంగా ప్రకటించకపోవడానికి కారణమేంటి?
ప్రతి సినిమాకి ఓ ప్లాన్ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తాం. ఆ సినిమా విడుదల తేదీ, ఇతర విషయాల గురించి ఇప్పుడే చెప్పలేను.

 

ఎన్టీఆర్ శతజయంతికి అమెరికాలో ఆయన విగ్రహం పెట్టాలి అనుకున్నారు కదా.. ఏమైంది?

ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి అక్కడ మేయర్ అనుమతి కూడా తీసుకున్నాం. కానీ కొందరు దీనిని అడ్డుకోవాలని చూస్తున్నారు. అందుకే మేలో విగ్రహం ఏర్పాటు చేయలేకపోయాం. త్వరలో ఏర్పాటు చేసేలా సన్నాహాలు చేస్తున్నాం.