పవన్ సినిమా రవితేజకు అలా దక్కింది!

Tuesday,October 30,2018 - 07:01 by Z_CLU

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా ఎప్పట్నుంచో చర్చల్లో ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఆ సినిమా సెట్స్ పైకి రావాలి. కానీ ఈ ప్రాజెక్టుపై ఎన్నో అనుమానాలు, మరెన్నో ఊహాగానాలు. ఎట్టకేలకు వీటికి చెక్ పెట్టారు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు.

సవ్యసాచి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్, మోహన్, రవి… రవితేజతో సినిమాపై రియాక్ట్ అయ్యారు. నవంబర్ చివరి వారం నుంచి ఆ సినిమా స్టార్ట్ అవుతుందని ప్రకటించారు. అంతేకాదు, మూవీపై ఉన్న మరికొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశారు.

మొదట ఈ కథను సంతోష్ శ్రీనివాస్ ద్వారా పవన్ కు వినిపించిన మాట నిజమే అంటున్నారు నిర్మాతలు. అయితే పవన్ తప్పుకోవడంతో, కథకు కొన్ని మార్పులు చేసి రవితేజ హీరోగా తీయబోతున్నామని ప్రకటించారు. తమిళ హిట్ తేరి సినిమా నుంచి ప్లాట్ తీసుకున్నారనే విషయాన్ని కూడా కన్ ఫర్మ్ చేశారు.

కేవలం ప్లాట్ మాత్రమే తేరి నుంచి తీసుకున్నామని, మిగతాదంతా సంతోష్ శ్రీనివాస్ సొంతంగా రాశాడని అంటున్నారు మైత్రీ నిర్మాతలు. సవ్యసాచి థియేటర్లలోకి వచ్చిన వెంటనే రవితేజ-సంతోష్ శ్రీనివాస్ సినిమా మొదలవుతుందని ప్రకటించారు.