RC16 చిరంజీవి క్లాప్ తో గ్రాండ్ గా లాంచ్

Wednesday,March 20,2024 - 03:34 by Z_CLU

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, RRR ఘన విజయం తర్వాత లార్జర్  సెక్షన్ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథలను ఎంచుకుంటున్నారు.  రామ్ చరణ్ తన 16వ సినిమా కోసం,’ఉప్పెన’ బ్లాక్ బస్టర్ తో సంచలనం సృష్టించిన దర్శకుడు బుచ్చి బాబు సానతో కలిసి పని చేస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్,  సుకుమార్ రైటింగ్స్ సగర్వ సమర్పణలో,  వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై భారీ కాన్వాస్‌పై నిర్మిస్తున్న #RC16తో నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్‌గా చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నారు.

#RC16 మొత్తం టీమ్‌, చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో అద్భుతంగా లాంచ్ అయ్యింది. ఈ గ్రాండియర్ లాంఛింగ్ వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి,  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , ది సెలెస్టియల్ బ్యూటీ జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ముహూర్తం షాట్ కు క్లాప్ కొట్టారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్క్రిప్ట్ అందజేయగా, బోనీకపూర్ కెమెరా స్విచాన్ చేశారు. రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు శంకర్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మాగ్నమ్ ఓపస్‌లో భాగమైన అకాడమీ-విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ..‘‘మెగాస్టార్‌ చిరంజీవిగారికి, నా గురువు సుకుమార్‌గారికి థాంక్స్‌. చరణ్‌ గారి రంగస్థలం సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ని. ఇప్పుడు రామ్ చరణ్ గారి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటానని హామీ ఇస్తున్నాను. ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేయాలనే నా కల కేవలం నా రెండో సినిమాతోనే నెరవేరుతుందని ఊహించలేదు. చరణ్ సార్, సుకుమార్ సార్, రవి, నవీన్, సతీష్ గారి వల్ల సాధ్యపడింది. నేను జాన్వీ గారిలాంటి స్టార్‌డమ్, ఫేమ్ ఉన్న నటిని పాత్రలో ఊహించుకున్నాను. అదృష్టవశాత్తూ, జాన్వీ గారే మా ప్రాజెక్ట్ లో భాగం అవ్వడం ఆనందంగా వుంది” అన్నారు.

సుకుమార్ మాట్లాడుతూ, “నేను బుచ్చికి మెంటార్‌ని, నేను అతనికి లెక్కలు నేర్పించాను. అతను నా నుండి ఏమీ నేర్చుకోలేదు. అతను ప్రతిదానికీ భయపడతాడు. ఉప్పెనలో విలన్ పాత్ర కోసం విజయ్ సేతుపతిని అనుకున్నపుడు నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత తన తదుపరి సినిమా హీరో ఎవరని ప్రశ్నిస్తే రామ్ చరణ్ అన్నాడు. ఈ చిత్రానికి సంగీతం అందించడానికి ఏఆర్ రెహమాన్ మాత్రమే ఛాయిస్ అన్నాడు. ఆ తర్వాత కథానాయికగా జాన్వీ కపూర్‌, మరో ముఖ్యమైన పాత్ర కోసం శివ రాజ్‌కుమార్‌ పేర్లను చెప్పాడు. బుచ్చికి సబ్జెక్ట్ మీద నమ్మకం ఉంది. చాలా కష్టపడి పనిచేస్తాడు. కథ విన్న తర్వాత చరణ్ ఓకే చెప్పారు. సతీష్,.. రవి, నవీన్ స్నేహితుడిగా నాకు తెలుసు. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌తో ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ “సుకుమార్ గారు చెప్పినట్లు బుచ్చి బాబు చాల క్రేజీ, కానీ గొప్ప అభిరుచి ఉంది. అతను పాటల కోసం ఐదు విభిన్న సిట్యువేషన్స్ ఇచ్చాడు. అతనిలో ఉన్న ఉత్సాహం ఇన్ఫెక్షన్ లాంటింది. మేము ఇప్పటికే 3 ట్యూన్‌లను పూర్తి చేసాము. అతనికి, మొత్తం టీమ్‌కి ధన్యవాదాలు,శుభాకాంక్షలు. ” తెలిపారు

రామ్ చరణ్ మాట్లాడుతూ ”రెహమాన్ సర్ చెప్పినట్లు బుచ్చి నిజంగా క్రేజీ మాన్. ఆయనకు సినిమా అంటే పాషన్. రంగస్థలం కోసం సుకుమార్ కేవలం 38 నిమిషాల నేరేషన్ ఇచ్చారు. అప్పట్లో సినిమా మేకింగ్ లో సుకుమార్ బిజీగా ఉన్న సమయంలో బుచ్చి200 రోజులు క్యారవాన్‌లో ప్రతిరోజూ 2 గంటల నేరేషన్ ఇచ్చారు. బుచ్చి స్క్రిప్ట్‌ని సొంతం చేసుకొని, కథలో లీనం చేస్తారు. ఇంత పెద్ద టీమ్‌ని పొందడం అంత సులభం కాదు. సుకుమార్‌గారి బెస్ట్ ప్రోటీజ్ బుచ్చిబాబుతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఏఆర్ రెహమాన్ సర్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నేను, జాన్వీ కపూర్ కలిసి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సినిమా చేయడం చాలా మందికి చిరకాల కోరిక. మైత్రి మూవీ మేకర్స్‌తో సతీష్ ఎప్పుడూ ఉంటారు. టీమ్‌కి నా శుభాకాంక్షలు”  తెలిపారు.

జాన్వీ కపూర్, “ అందరికీ ధన్యవాదాలు. నా కెరీర్ ప్రారంభ దశలో నేను ఇష్టపడే, ఆరాధించే చాలా మంది వ్యక్తులతో స్టేజ్‌పై వుండటం చాలా ఆనందంగా వుంది. దిన్ని ఆశీర్వదంగా భావిస్తున్నాను. ఈ కథ చెప్పడానికి రెండు నెలల క్రితం బుచ్చి నా దగ్గరకు వచ్చారు. అతని కళ్లలో క్రేజీ, పాషన్ కనిపించాయి. ఈ టీమ్‌లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ ఉన్న ప్రతిసారీ, నేను ఇంటికి వస్తున్నట్లు అనిపిస్తుంది. నేను మీ అందరినీ గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నాను’ అన్నారు