Mili నన్ను కొత్తగా ఆవిష్కరించిన సినిమా - జాన్వి

Thursday,November 03,2022 - 02:31 by Z_CLU

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’ (Mili). మాతుకుట్టి గ్జేవియర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్ 4న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ జరిగింది.

ఈ సందర్భంగా… జాన్వీ కపూర్ మాట్లాడుతూ “డైరెక్టర్‌ గారు స్టోరి చెప్పినప్పుడు ‘మిలి’ చిత్రంతో నటిగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం ఉందనిపించింది. రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన నాన్న చాలా ఎగ్జయిట్ అయ్యారు. నన్ను, తనని తెరపై చూసుకున్నట్లు అనిపించిందని అన్నారు. మా నాన్నగారితో నేను చేసిన తొలి సినిమా. మాతుకుట్టి సార్‌తో కలిసి నటించటం చాలా లక్కీ అనిపించింది. -18 డిగ్రీల టెంపరేచర్‌లో 22 రోజుల పాటు చిత్రీకరించాం. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయటం చాలా కష్టం. నాన్నగారు నిర్మాతగా ఎలాంటి వ్యక్తో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి మనసున్న నిర్మాత అని అంటుంటారు. ఈ సినిమా సమయంలోనూ అది నిజమని ప్రూవ్ చేశారు. సెట్స్‌కైతే చాలా తక్కువ సార్లు వచ్చారంతే. తన నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఇచ్చే సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నటిగా 15-16 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉండటం అంటే చిన్న విషయం కాదు.. చాలా ఇబ్బంది పడ్డ సందర్భాలున్నాయి. అయితే ఇలాంటి పాత్రలో నటించటం వల్ల మానసికంగా మరింత బలంగా తయారయ్యాను. దక్షిణాది ప్రేక్షకులు మా అమ్మకి, నాన్నకి ఎంత ప్రేమను అందించారో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు. నేను కూడా చాలా రోజులుగా సౌత్‌లో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. త్వరలోనే చేసే అవకాశం ఉంది’’ అన్నారు.