విశాల్ ఇంటర్వ్యూ
Sunday,May 27,2018 - 09:30 by Z_CLU
మాస్ హీరో విశాల్ లేటెస్ట్ మూవీ ‘ఇరుంబుతెరై’ కోలీవుడ్ లో ఇటివలే విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో జూన్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా విశాల్ ఈ సినిమా గురించి కొన్ని విషయాలు మీడియాతో పంచుకున్నాడు. ఆ విశేషాలు విశాల్ మాటల్లోనే…
కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్
తమిళంలో ‘ఇరుంబు తిరై’ పేరుతో విడుదలైన సూపర్ హిట్ అయిన ఈ సినిమా ‘అభిమన్యుడు’ టైటిల్ తో జూన్ 1 న విడుదలవుతుంది. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ సాదించిన సినిమా ఇది. చాలా సంవత్సరాల తర్వాత రివ్యూస్ పరంగా, కలెక్షన్స్ పరంగా నాకు శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా.
అవన్నీ ఇబ్బందులను కలిగించేవే
తమిళనాడులో ఈ సినిమా విడుదలయినప్పుడు సినిమాకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. రెండు షోలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఎగైనెస్ట్ డిజిటల్ ఇండియా, ఎగైనెస్ట్ ఆధార్ కార్డ్ అని సినిమాకు వ్యతిరేకంగా కొందరు నినాదాలు కూడా చేశారు. ఆ సమయలో పోలీసులు మాకెంతో సపోర్ట్ అందించారు. సినిమా రిలీజైన తర్వాత ప్రేక్షకులకు నచ్చడంతో అన్నీ పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఈ సినిమాలో చూడబోయే విషయాలు షాకింగ్గా ఉంటాయి. ఏటీంలో జరిగే మోసాలు, రైతులు బ్యాంకు లోన్స్ తీసుకోవడంలో ఇబ్బందులు, మిలటరీ ఆఫీసర్కి పాస్బుక్ లేదు అనే విషయం… మన ఫేస్ బుక్లో అన్నీ విషయాలను ఓపెన్గా చెప్పేస్తున్నాం. అవన్నీ మనకు భవిష్యత్లో ఇబ్బందులను కలిగించేవే.
గర్వంగా ఫీలవుతున్నా
ఈ సినిమాలో అర్జున్గారు వైట్ డెవిల్ అనే పాత్రలో కనిపిస్తారు. గతంలో ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ సమయంలో ఆయన నన్ను ఇన్స్పైర్ చేసి హీరోగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఫీలవుతున్నాను. ముందుగా ఈ రోల్ కోసం ఆయన్ను అనుకున్న వెంటనే డైరెక్టర్ ని వెళ్లి స్క్రిప్ట్ చెప్పమని ఆయన దగ్గరికి భయపడుతూ పంపించా.. కానీ విన్న వెంటనే ఈ క్యారెక్టర్ కి ఒకే చెప్పి ఆయన పెర్ఫార్మెన్స్ తో సినిమాకు హైలైట్ గా నిలిచారు. ఈ సందర్భంగా అర్జున్ గారికి నా స్పెషల్ థాంక్స్ .
సినిమా రూపంలో
దర్శకుడు మిత్రన్ కిది మొదటి సినిమా.. నన్ను కలిసి కథ చెప్పగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. సమాజంలో జరుగుతున్న విషయాలను ఎంతో ధైర్యంగా సినిమా రూపంలో చూపించాడు. ఈ సినిమాతో తమిళ్ లో ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. నా కెరీర్ లో ఒక మంచి సినిమా ఇచ్చినందుకు ఆయనకు మరోసారి ధన్యవాదాలు చెప్తున్నా.
వాళ్ళిద్దరి లక్ తోడైంది
ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటుందా..అనుకుంటున్న సమయంలో సమంత అయితే బెటర్ అని నాకు మిత్రన్ కి ఇద్దరికీ అనిపించింది. తమిళ్ లో సమంత సినిమాటోగ్రాఫర్ జార్జ్ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. మా సినిమాకు వాళ్ళిద్దరి రూపంలో లక్ మరింత కలిసొచ్చింది. సమంత క్యారెక్టర్… మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.
అన్నీ కలిసొచ్చాయి
మిత్రన్ ఈ కథ చెప్పగానే ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్న ఎగ్జైట్మెంట్ తోనే సినిమాను స్టార్ట్ చేసాం.. అక్కడి నుండి సినిమాకు అన్ని కలిసొచ్చాయి. నటుడుగానే కాదు, నిర్మాతగా కూడా ఎంతో సంతోషాన్ని..తృప్తి ని కలిగించిన సినిమా ఇది.
బాధ్యత ఉంటే చాలు
ఈ సినిమా చూసిన తర్వాత మీరు మీ ఫోన్ను జాగ్రత్తగా ఉపయోగించుకుంటారు. భవిష్యత్లో మన చుట్టు ఉన్న పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. సమాజంలో జరిగే విషయాలను చెప్పడానికి మాకు బాధ్యత ఉంది. ప్రేక్షకులకు నిజాలను చెప్పడానికి సినిమా అనే మీడియాని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. ఆధార్ కార్డ్, డిజిటల్ ఇండియా వల్ల ప్రజలు ఫేస్ చేయబోయే పరిస్థితులను ఇందులో చూపించబోతున్నాం. అలాగని నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమా చేయలేదు. ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్కు లింక్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇంత స్ట్రాంగ్ కంటెట్ను ఇంత ధైర్యంగా ఎలా చెప్పారని చాలా మంది అడిగారు. ఇలాంటి విషయాలను చెప్పడానికి ధైర్యం అవసరం లేదు. బాధ్యత ఉంటే చాలు అని చెప్పాం.
త్వరలోనే సీక్వెల్
మిత్రన్ ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేసాడు. అందులో కొంత వరకూ మాత్రమే ఈ సినిమాలో చూపించడం జరిగింది. మిగతాది పార్ట్ 2 లో చూపించాలనే ఆలోచన ఉంది. స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడే రెండు పార్ట్స్ గా తీద్దామనుకున్నాం. ఇప్పుడు సినిమా సూపర్ హిట్ అయింది కాబట్టి త్వరలోనే కచ్చితంగా సీక్వెల్ ప్లాన్ చేస్తాం.కానీ అది ఎప్పుడు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పలేను.