నేను చనిపోలేదు.. బతికే ఉన్నాను
Sunday,May 24,2020 - 02:07 by Z_CLU
వయసు పైబడిన సినీ ప్రముఖులు ఎవరో ఒకరు చనిపోయారంటూ తరచుగా గాసిప్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా మరో దిగ్గజ నటిని నెటిజన్లు చంపేశారు. దీనిపై సీనియర్ నటి గట్టిగా రియాక్ట్ అయ్యారు. తాను ఇంకా బతికే ఉన్నానని దయచేసి తనను చంపేయొద్దంటూ సోషల్ మీడియా ద్వారా పుకార్లకు చెక్ పెట్టారు.
బాలీవుడ్ దిగ్గజ నటి ముంతాజ్ చనిపోయారని ఇటీవల కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫొటోలు సైతం షేర్ చేసి కొందరు సంతాపం తెలిపారు. దీనిపై దిగ్గజ నటి ముంతాజ్ ఘాటుగా స్పందించారు. కుమార్తె తన్యా మధ్వాని ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి వీడియో పోస్ట్ చేశారు. అలనాటి హీరోయిన్లలో సెక్సీ హీరోయిన్ గా, రొమాన్స్ పండించడంతో దిట్టగా ఆమె పాపులర్ అయ్యారు.
‘నేను చనిపోలేదు. బతికే ఉన్నాను. ఆ రూమర్స్ నమ్మవద్దని’ తన అభిమానులకు ముంతాజ్ సూచించారు. గతంలో తన తల్లి క్యాన్సర్తో పోరాడుతున్న ఫొటోలను షేర్ చేసి మా అమ్మ ముంతాజ్ చనిపోయారంటూ దుష్ప్రచారం చేశారని తన్యా మధ్వాని తెలిపారు. ఆమె వయసు 73 ఏళ్లు. ఆమె ఇప్పటికీ చాలా సంతోషంగానూ, అందంగానూ ఉన్నారు. ఆమెకు ఎవరైనా బ్రేక్ ఇస్తారా అని తన్యా పోస్ట్ పెట్టారు.