Venkatesh reveals Drushyam 2 Storyline
దృశ్యం సినిమా కథ ఏంటనేది అందరికీ తెలిసిందే. దానికి కొనసాగింపుగా వస్తున్న దృశ్యం-2 కథ ఎలా ఉంటుందో కూడా అంతా ఊహించుకోగలరు. అందుకే ఈ సినిమా వరకు కథను దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు వెంకటేష్. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే దృశ్యం-2 కథ ఎలా ఉండబోతోందో చెప్పేశాడు.
“ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు రాంబాబు. అది తప్పా.. ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు ముఖ్య ఉద్దేశ్యం. అలాంటి పాత్రలో మళ్లీ నటించడం ఆనందంగా ఉంది. సీక్వెల్ చేస్తే సినిమా హిట్ అవుతుందా? లేదా? అని అందరిలోనూ కొన్ని అనుమానాలుంటాయి. కానీ జీతూ జోసెఫ్ మాత్రం మొదటి పార్ట్ కంటే అద్భుతంగా స్క్రిప్ట్ రాశారు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? అని జనాలు అనుకుంటారు. అంతా బాగుందని అనుకునే సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం.. సీటు అంచును కూర్చోబెట్టే సినిమాలు అంటారు కదా?..అలా ఉంటుంది సినిమా. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు రాంబాబు. ఫ్యామిలినీ రక్షించడం మాత్రం తెలుసు.”
ఇలా దృశ్యం-2 కథ చెప్పేశాడు వెంకీ. ట్రయిలర్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పేశారు. రాంబాబు పాత్ర చాలా గొప్ప పాత్ర అని, ఈ క్యారెక్టర్ లో మోహన్ లాల్ అద్భుతంగా నటించారని తెలిపిన వెంకటేష్.. ఈ పాత్రలో మరోసారి నటించినందుకు చాలా హ్యాపీగా ఉందన్నాడు. పనిలోపనిగా దృశ్యం-3పై కూడా స్పందించాడు వెంకీ.
“దృశ్యం-2 దాదాపు ఒరిజినల్లానే ఉంటుంది. ఎక్కువ మార్పులు చేర్పులు చేయలేదు. కొత్తగా నాలుగైదు సీన్లు యాడ్ చేశాం. మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం 2 అర్థమవుతుంది. దృశ్యంకి మూడో పార్ట్ ఉంటుందో లేదో నాకు తెలీదు. అయితే ఈ సారి మాత్రం చాలా టైం పడుతుందని మాత్రం డైరక్టర్ చెప్పారు. మూడు నాలుగేళ్లు పట్టొచ్చు. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.”
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics