Interview - సురేష్ వర్మ , స్వాతి రెడ్డి (మంగళవారం)

Tuesday,November 14,2023 - 05:12 by Z_CLU

‘మంగళవారం’ సినిమాతో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కుమార్తె స్వాతి రెడ్డి గునుపాటి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు అజయ్ భూపతికి చెందిన ‘ఏ’ క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై ఎం. సురేష్ వర్మతో కలిసి చిత్రాన్ని నిర్మించారు. పాయల్ రాజ్‌ పుత్, ‘రంగం’ ఫేమ్ అజ్మల్ అమీర్ జంటగా… నందిత శ్వేత, దివ్య పిళ్లై, రవీంద్ర విజయ్, అజయ్ ఘోష్, శ్రీ తేజ్, శ్రవణ్ రెడ్డి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు స్వాతి, సురేష్ వర్మ మీడియాతో మాట్లాడారు.

 

స్వాతి గారు… మీ కుటుంబం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి ఉంది. ఈ సినిమా రంగంలో మీరు రావడం కొంచెం ఆలస్యమైందా?

స్వాతి రెడ్డి గునుపాటి : ఆలస్యం అయ్యిందని అనుకోను. ఇంతకు మించి పర్ఫెక్ట్ టైమింగ్ మాకు కుదిరేది కాదేమో!? నాకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి. ఎందుకంటే… ఇంత మంది ఓ సినిమా ఎలా చేస్తారని నాలో క్యూరియాసిటీ ఉంది. ఓ ఐడియాను ఎంతో మంది నమ్మి కష్టపడతారు. మాటీవీలో చేరినప్పుడు సురేష్ వర్మ గారిని ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకున్నా. మాటీవీలో ఉండగా సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని ఆయనతో చెప్పాను. ఆయనకూ సినిమా ప్రొడ్యూస్ చేయాలని ఉందని చెప్పారు. ఇండస్ట్రీలో ఆయన నా కంటే సీనియర్. చేస్తే కలిసే చేయాలనుకున్నాం. నేను లేకుండా ఆయన చేయలేదు. ఆయన లేకుండా నేను సినిమా చేయలేదు. మేం అనుకున్న దానికంటే సినిమా బాగా వచ్చింది.

 

‘మంగళవారం’తోనే ఎందుకు నిర్మాతగా మారారు? దీని కంటే ముందు ఏవైనా కథలు విన్నారా?

సురేష్ వర్మ : ‘మంగళవారం’ కంటే ముందు రెండు మూడు కథలు విన్నామంతే! ‘ఆర్ఎక్స్ 100’ టైంలో అజయ్ భూపతి ‘మంగళవారం’ కథ నాకు చెప్పారు. ఎగ్జైట్ చేసిన కథ ఇది. అజయ్ ఏమో తన సొంత సంస్థలో చేయాలని అనుకున్నాడు. ఆ మధ్యలో నేను కూడా కొందరు నిర్మాతలకు అజయ్ దగ్గర మంచి కథ ఉందని చెప్పా. స్వాతి గారికి అజయ్ దగ్గర కథ గురించి చెబితే… ‘విందాం! రమ్మనండి’ అని అడిగా.
స్వాతి రెడ్డి : మధ్యలో కథలు విన్నప్పటికీ… నేను ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ కథ వచ్చింది. అంతా డెస్టినీ! అలా కుదిరింది.

 

అల్లు అర్జున్ కథ విని ఓకే అన్నాక ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందా?

స్వాతి : నేను అప్పటికి 80 పర్సెంట్ అనుకున్నా. నాలో కాన్ఫిడెన్స్ ఉంది. అయితే అల్లు అర్జున్ వల్ల సినిమా చేయాలనే ధైర్యం వచ్చింది. ‘ఎందుకు కలగా వదిలేయాలి. నువ్వు ట్రై చెయ్. చేసినప్పుడు నీతో ఎవవరైనా పార్ట్నర్ ఉంటే బావుంటుంది’ అని చెప్పాడు. సురేష్ వర్మ గారికి కూడా సేమ్ డ్రీమ్ ఉండటంతో ఇద్దరం కలిసి ఫిల్మ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాం.

 

బన్నీతో మీ బాండింగ్ ఎప్పుడు మొదలైంది?

స్వాతి : చాలా ఏళ్ళ క్రితమే. ‘మా టీవీ’ కంటే ముందు నుంచి మేం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీస్ మధ్య బాండింగ్ ఉంది. మేం కూడా ఫ్రెండ్స్ అయ్యాం. ఒక ఫన్నీ స్టోరీ ఏంటంటే… నేను కాలేజీలో ఉన్నప్పుడు ‘అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావాలి’ అని మా హెచ్ఓడి కండిషన్ పెట్టారు. నాన్నను రిక్వెస్ట్ చేశా. అరవింద్ అంకుల్ గారికి చెప్పమని అడిగా. ఆ టైంలో బెంగళూరు మా కాలేజీలో ఫెస్ట్ కి బన్నీ వచ్చారు. అప్పటి నుంచి మేం చాలా క్లోజ్ అయ్యాం. బన్నీ వైఫ్ స్నేహకి నేను క్లోజ్. మా ఆయన ప్రణవ్, స్నేహ స్కూల్ మేట్స్. అలా మరింత దగ్గర అయ్యాం.

 

మీకున్న నేపథ్యానికి పెద్ద హీరోలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్టార్ హీరోలతో సినిమాలు చేయవచ్చు. ‘మంగళవారం’ చేయడానికి కారణం?

స్వాతి : నిర్మాతగా అడుగులు వేస్తున్నప్పుడు పెద్ద ప్రెజర్ పెట్టుకోవడం కంటే చిన్న సినిమా చేయడం మంచిదని అనుకున్నా. కథకు ప్రాముఖ్యం ఇస్తూ టీమ్ వర్క్ ఉండేలా సినిమా చేయాలనుకున్నా. ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాకు వస్తున్న స్పందనను కలలో కూడా ఊహించలేదు.

 

కమర్షియల్ సినిమా, లవ్ స్టోరీ చేయడం కంటే డార్క్ థ్రిల్లర్ ఎలా వస్తుందో ఊహించడం కష్టం కదా!

స్వాతి : ఈ జానర్ ఫిల్మ్ చేయాలని అనుకోలేదు. కామెడీ ఫిలిమ్స్ ఎక్కువ చూస్తా. థ్రిల్లర్స్ తక్కువ. అజయ్ భూపతి గారి నేరేషన్ విని ‘ఈ మూవీ చేస్తే బావుంటుంది’ అనిపించింది. సినిమాలో ఓ సందేశాన్ని చెప్పిన విధానం బాగా నచ్చింది. ఇందులో మ్యూజిక్, ఎమోషన్స్, మెసేజ్… అన్నీ ఉన్నాయి.
సురేష్ వర్మ : డార్క్ థ్రిల్లర్ అయినప్పటికీ… ఈ సినిమాలో ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. ముందు నుంచి రెగ్యులర్ సినిమా చేయాలని మేం అనుకోలేదు. అదీ ఈ సినిమా చేయడానికి ఓ కారణం! ప్రతి పాత్రకు ప్రాముఖ్యం ఉంది.

 

ఫేస్ మాస్క్ డిజైన్ ఐడియా ఎవరిది?

సురేష్ వర్మ : అజయ్ భూపతి ఐడియా అది. ‘కాంతార’కు ముందు కథ చెప్పాడు. ఆ టైంలో మాస్క్ గురించి చెప్పాడు. ఎన్నో స్కెచ్లు వేయించి చివరికి ఈ మాస్క్ ఓకే చేశాం. దర్శకత్వం మాత్రమే కాకుండా చాలా బాధ్యతలు చూసుకున్నారు. బాగా హ్యాండిల్ చేశాడు. అందువల్ల, మా మీద ఒత్తిడి లేదు. బౌండ్ స్క్రిప్ట్ రెడీ అయ్యాక షూటింగ్ స్టార్ట్ చేశాం. కొన్ని ఇంప్రవైజేషన్స్ చేశాడంతే!
స్వాతి : అజయ్ భూపతికి మేం ఫ్రీడమ్ ఇచ్చాం. అయితే… ప్రతిదీ మాకు చెప్పి, మా సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకున్నారు. మేం ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్నాం.

 

అల్లు అర్జున్ నుంచి సలహాలు ఏమైనా వచ్చాయా?

స్వాతి : బన్నీని అజయ్ భూపతి కలిసినప్పుడు నేను లేను. తర్వాత ఫోనులో నేను మాట్లాడా. ‘ఆర్ఎక్స్ 100’ కల్ట్ ఫిల్మ్. ‘మహాసముద్రం’ కూడా బన్నీకి ఇష్టం. అజయ్ భూపతి డైరెక్షన్ సెన్స్ ఇష్టం.

ఆయనకు సినిమా ఎప్పుడు చూపిస్తున్నారు?

స్వాతి : (నవ్వుతూ…) అల్లు అర్జున్ షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రీ రిలీజ్ రోజు కూడా షూటింగ్ నుంచి డైరెక్టుగా వచ్చారు.
సురేష్ వర్మ : ఫస్ట్ డే నుంచి అల్లు అర్జున్ మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పోస్టర్ రిలీజ్ నుంచి ప్రతి విషయంలో ఎగ్జైట్ అయ్యారు.

 

‘మంగళవారం’ నిర్మాణంలో మీరు నేర్చుకున్న విషయాలు?

స్వాతి : మంచి దర్శకుడు, టీమ్ లభించింది. అందుకు నేను లక్కీ. జీవితంలో ఏ విషయాన్నైనా అజయ్ భూపతి చూసే విధానం నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇలా కూడా ఆలోచిస్తారా? అనిపించింది. సంగీత దర్శకుడు అజనీష్ వర్కింగ్ స్టైల్ నచ్చింది. పిచ్చి ప్రేమతో సినిమాకు వర్క్ చేయడం చూశా.

 

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారా?

స్వాతి : తప్పకుండా చేస్తా. ఈ ఏడాది సినిమా కాకుండా ఇంకా చాలా వ్యాపారాలు స్టార్ట్ చేశా. పిజ్జా బ్రాండ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశా. కిడ్స్ సెంటర్ ఒకటి, సెమి కండక్టర్ కంపెనీ ఒకటి స్టార్ట్ చేశాం.
సురేష్ వర్మ : సక్సెస్ ఫెయిల్యూర్ అని కాకుండా ప్రాసెస్ ఎంజాయ్ చేయడం మా బాస్, స్వాతి ఫాదర్ నిమ్మగ్గడ్డ ప్రసాద్ గారు నేర్పించారు. మేం ఈ సినిమా ప్రాసెస్ ఎంజాయ్ చేశాం. మాటీవీలో కూడా ఎంజాయ్ చేస్తూ పని చేశాం. జయాపజయాలతో సంబంధం లేకుండా, మా ప్రయత్నలోపం లేకుండా సినిమాలు చేస్తాం.

 

నార్మల్ సినిమా కంటే ఎక్కువ బడ్జెట్ అయ్యిందన్నారు. అప్పుడు మీకు రిస్క్ అనిపించిందా?

స్వాతి : మేం ముందు అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం స్కేల్ పెరిగింది. ఆ బడ్జెట్ పెడితే అజయ్ భూపతి గారి విజన్ స్క్రీన్ మీదకు వస్తుందని అనిపించింది. రొటీన్ కాకుండా డిఫరెంట్ గాచేశాం. ఈ తరహా కథలు, జానర్ సినిమాలను ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకని, హ్యాపీ! మ్యూజిక్, నటీనటుల విషయంలో కాంప్రమైజ్ కాలేదు.

 

విడుదలకు ముందు టేబుల్ ప్రాఫిట్ రావడం ఎలా ఉంది?

స్వాతి, సురేష్ వర్మ : (నవ్వుతూ…)  అది ఎవరికైనా సంతోషం కలిగించే వార్తే కదా! మా మొదటి ప్రయత్నానికి అందరి నుంచి మంచి మద్దతు లభించింది. ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాం.

 

మిగతా భాషల నుంచి ఎటువంటి స్పందన లభిస్తోంది?

సురేష్ వర్మ : మంచి స్పందన ఉంది. తమిళంలో ట్రైడెంట్ రవి గారు విడుదల చేస్తున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు.

 

పాయల్ కంటే ముందు ఎవరినైనా అనుకున్నారా?

స్వాతి : అజయ్ భూపతి గారు 40, 50 ఆడిషన్స్ చేశారు. మధ్యలో పాయల్ పేరు చర్చకు వచ్చింది. కానీ, ఆమె ఇంతకు ముందు చేసిన పాత్రల కారణంగా ఈ సినిమాలో పాత్రకు సూట్ అవుతుందా? లేదా? అని సందేహం కలిగింది. మేం లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఓకే చేశాం. పాయల్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఎంతో కష్టపడి చేసింది.

 

నెక్స్ట్ సినిమా?

స్వాతి : ఆలోచిస్తున్నాం. మళ్ళీ మేం ఎగ్జైట్ అయినప్పుడు తప్పకుండా చేస్తాం.

 

అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలు మీకు ఫ్రెండ్స్! వాళ్ళతో సినిమా చేసే ప్లాన్స్ ఉన్నాయా?

సురేష్ వర్మ : భవిష్యత్తులో చేయవచ్చు.
స్వాతి : ప్రస్తుతానికి అటువంటి ప్లాన్స్ లేవు. వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. నాకు స్నేహాన్ని, వ్యాపారాన్ని ముడిపెట్టడం నాకు అంతగా ఇష్టం లేదు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేస్తారు. అలాగని, వెంటనే అడగలేను. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకుని, కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వాళ్ళను అడుగుతా. ఇప్పుడు అడిగితే నా కోసం వాళ్ళు చేస్తారు. అలాగని, నేను అడగలేను.

 

చిరంజీవి గారు ట్రైలర్ ట్వీట్ చేసి మీ గురించి బాగా చెప్పారు. ఎలా అనిపించింది?

స్వాతి : చాలా ఎమోషనల్ మూమెంట్ అది. పిల్లలంతా కలిసి ఉంటాం. ‘నువ్వు కూడా మీ నాన్నలానే’ అని కలిసినప్పుడు అంటూ ఉంటారు. ‘మంగళవారం’ టీజర్, ట్రైలర్ చూసి అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. పోస్టర్ విడుదలైన తర్వాత నాకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు. పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకున్నా. (నిమ్మగడ్డ నుంచి గునుపాటి). నాన్నకు టీజర్ చూపించినప్పుడు పేరు చూసి ‘సురేష్ తో కలిసి నువ్వు చేస్తున్నావా?’ అని అడిగారు. అప్పుడు హ్యాపీ ఫీలయ్యారు.
సురేష్ వర్మ : నేను చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. చిన్నప్పుడు చూస్తే చాలు అని ఫీలయ్యా. ఈ రోజు మా సినిమాకు ఆయన ట్వీట్ చేయడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి.