నాగ చైతన్య క్లాప్ తో సంతోష్ శోభన్ కొత్త సినిమా

Monday,October 30,2023 - 01:17 by Z_CLU

బేబి ఘన విజయంతో కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు నిర్మాత ఎస్ కేఎన్, దర్శకుడు సాయి రాజేశ్. ఈ కల్ట్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. యంగ్ హీరో సంతోష్ శోభన్, సోషల్ మీడియా ఫేమ్ అలేఖ్య హారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో స్టార్ హీరో నాగ చైతన్య క్లాప్  తో ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ హరీశ్ శంకర్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రానికి సుమన్ పాతూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి స్టార్ హీరో నాగ చైతన్యతో పాటు పలువురు స్టార్ డైరెక్టర్స్ హాజరయ్యారు. డైరెక్టర్ చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా..ఫస్ట్ షాట్ కు వశిష్ట మల్లిడి దర్శకత్వం వహించారు. హీరో సుశాంత్, దర్శకులు హను రాఘవపూడి, రాహుల్ సాంకృత్యన్ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ – ఎస్ కేఎన్, సాయి రాజేశ్ తో కలిసి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మేము కలిసి ఇప్పటికే సినిమా చేయాల్సింది. సాయి రాజేశ్ ఫెంటాస్టిక్ రైటర్, డైరెక్టర్. బేబి అద్భుమైన లవ్ స్టోరి. ఒక హీరోగా నాపై ఎంతో నమ్మకం పెట్టుకునే ఎస్ కేఎన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. డైరెక్టర్ సుమన్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. అలేఖ్యతో కలిసి నటించేందుకు ఎదురుచూస్తున్నా. మా సినిమాకు మంచి టీమ్ కుదిరింది. అన్నారు

డైరెక్టర్ సాయి రాజేశ్ మాట్లాడుతూ – మా అమృత ప్రొడక్షన్స్ లో కలర్ ఫొటో అనే సినిమా నిర్మించాను. దానికి నేషనల్ అవార్డ్ వచ్చింది. అయితే ఆ సక్సెస్ క్రేజ్ లో వెంటనే సినిమా చేయలేదు. ఎందుకంటే మంచి కథ కుదిరినప్పుడే సినిమా నిర్మించాలని అనుకున్నా. అలాంటి కథ ఈ సినిమాకు సెట్ అయ్యింది. నేను, ఎస్ కేఎన్ కలిసి ఆరు లవ్ స్టోరీస్ చేయాలని అనుకున్నాం. కలర్ ఫొటో, బేబి వచ్చాయి. ఇప్పుడు ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. ఈ మూవీతో కలిపి నాలుగు అయ్యాయి. మరో రెండు లవ్ స్టోరీస్ చేస్తాం. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయా, సీక్వెల్సా అనేది ఇప్పుడే చెప్పలేను. ఇది నా మనసుకు దగ్గరైన కథ. నేను, ఎస్ కేఎన్, సందీప్ రాజ్, అలేఖ్య మేమంతా ఫ్రెండ్స్. ఈ సినిమా నా ఫ్రెండ్స్ తో కలిసి చేస్తున్నా కాబట్టి మరింత బాధ్యతగా ఫీలవుతున్నా. అన్ని క్రాఫ్టుల్లో ఈ సినిమాను ది బెస్ట్ గా తీసుకొస్తాం. యాక్టింగ్ వైపు ప్రాణం పెట్టే హీరో కావాలనుకున్నప్పుడు నాకు సంతోష్ శోభన్ గుర్తొచ్చారు. అన్నారు

డైరెక్టర్ సుమన్ పాతూరి మాట్లాడుతూ – ఈ సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చిన నా ఫ్రెండ్ సాయి రాజేశ్ కు థ్యాంక్స్. సంతోష్ శోభన్, అలేఖ్య, నా టీమ్ అందరికీ థ్యాంక్స్. నాకు దక్కిన ఈ అవకాశంతో మంచి మూవీ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అన్నారు.

హీరోయిన్ అలేఖ్య హారిక మాట్లాడుతూ – హీరోయిన్ గా సినిమా చేయాలన్నది నా డ్రీమ్. ఆ కల వైపు ఒక అడుగు ఇవాళ వేశాను. ఈ టీమ్ లో చాలా మంది నాకు మంచి ఫ్రెండ్స్. ఒక ఫ్యామిలీలా ఉంటాం. సంతోష్ తో పెయిర్ గా సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది. సినిమా సెట్ లో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నా. అని చెప్పింది.

మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ – బేబి తర్వాత సాయి రాజేశ్, ఎస్ కేఎన్ గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. అన్నారు

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – బేబి వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ఎలాంటి సినిమా చేయాలనే ఆలోచనలో ఉండేవాళ్లం. బేబి మేకింగ్ టైమ్ లోనే కొన్ని కథలు అనుకున్నాం. బేబి సూపర్ హిట్ తో 100 క్రోర్ గ్రాసింగ్ చేసిన మా సంస్థ మాస్ మూవీ మేకర్స్, కలర్ ఫొటోతో నేషనల్ అవార్డ్ గెల్చుకున్న అమృత ప్రొడక్షన్స్ కలిపి ఈ సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది. నా స్నేహితుడు సాయి రాజేశ్ అద్భుతమైన రైటర్. ఈ కథ విన్నప్పుడే కోర్ టీమ్ అంతా ఒకేలా హ్యాపీగా ఫీలయ్యాం, ఎగ్జైట్ అయ్యాం. నా ఫ్రెండ్ సంతోష్ శోభన్ మంచి యాక్టర్. హార్ట్ అండ్ సోల్ పెట్టి సినిమా చేస్తాడు. డెడికేషన్, హార్డ్ వర్క్, కమిట్ మెంట్ ఉన్న హీరో. ఈ కథ వినగానే అన్న..మనం ఈ సినిమా చేద్దామని ముందుకొచ్చాడు. ఇలా అందరికీ బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. బేబి మూవీ తర్వాత నాపై, సాయి రాజేశ్ పై బాధ్యత పెరిగింది. ఆ పేరును కాపాడుకుంటూ రిచ్ కంటెంట్ ఉన్న మూవీస్ చేస్తున్నాం. ఇదే కాదు ఆనంద్, వైష్ణవి చేస్తున్న సినిమా కూడా బలమైన కథతో ఉంటుంది. మా మనసుకు హత్తుకున్న సబ్జెక్ట్స్ ఇవి. మా చిరకాల మిత్రుడు సుమన్ పాతూరి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తుండటం హ్యాపీగా ఉంది. తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయాలి. అలా నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో రేష్మ, మానస, ప్రియాంక, వైష్ణవి, కావ్య, చాందినీ చౌదరి, హారిక..ఇలా తెలుగు అమ్మాయిలనే హీరోయిన్స్ గా తీసుకుంటున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి అతిథిగా వచ్చి క్లాప్ కొట్టిన హీరో నాగ చైతన్య, గెస్టులుగా వచ్చిన డైరెక్టర్స్ హరీశ్ శంకర్, హను రాఘవపూడి, వశిష్ట మల్లిడి, రాహుల్ సాంకృత్యన్, చందూ మొండేటి, హీరో సుశాంత్, నిర్మాత రవిశంకర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.