ALLU ARJUN అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో నాలుగో సినిమా

Monday,July 03,2023 - 12:32 by Z_CLU

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంఠపురములో’ సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒకదానికి మించి మరొకటి అన్నట్టుగా ఘన విజయం సాధించాయి. ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందింది.

గురు పూర్ణిమ శుభ సందర్భంగా, వీరి కలయికలో నాలుగో సినిమా ప్రకటన వచ్చింది. ఈసారి ఈ కలయిక తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

‘అల వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సామజవరగమన’, ‘బుట్ట బొమ్మ’, ‘రాములో రాముల’ పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు ఈ అద్భుతమైన కాంబినేషన్ మనం వెండితెరపై మునుపెన్నడూ చూడని దృశ్యకావ్యాన్ని అందించడానికి చేతులు కలిపింది.

ఈ కలయిక వినోదాన్ని అందించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క అద్భుతమైన కథాకథనాలు, ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమాని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశాయి. “రవీంద్ర నారాయణ్”, “విరాజ్ ఆనంద్”, “బంటు” వంటి పాత్రల్లో అల్లు అర్జున్ జీవించారు. ప్రతి పాత్ర ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని పొందాయి.

అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.8 కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు వారి ప్రియతమ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తో మరోసారి జతకట్టారు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొంది ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మూడు సినిమాలనూ హారిక & హాసిని క్రియేషన్స్ భారీ స్థాయిలో నిర్మించింది. ఇప్పుడు ఈ నాలుగో సినిమాని మరింత భారీస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరినీ సంతృప్తి పరచడానికి అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

హారిక & హాసిని క్రియేషన్స్‌తో కలిసి ‘అల వైకుంఠపురములో’ నిర్మాణంలో భాగమైన ప్రసిద్ధ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం అవుతుంది. ఈ చిత్రాన్ని పద్మశ్రీ అల్లు రామలింగయ్య మరియు శ్రీమతి మమత సమర్పణలో హారిక & హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న నాలుగో సినిమాని ఈరోజు ఉదయం 10:08 గంటలకు ప్రకటించారు. ఈ సందర్భంగా అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు. గత చిత్రాలను మించి అత్యంత భారీ స్థాయిలో అద్భుతమైన అనుభూతిని పంచే చిత్రాన్ని అందించబోతున్నామని వీడియో ద్వారా తెలిపారు.

నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.