మా సినిమా డిప్ కాలేదు... అందుకుంది
Sunday,August 12,2018 - 01:29 by Z_CLU
సుశాంత్, రుహనీ శర్మ జంటగా నటించిన చిత్రం ‘చిలసౌ’. అన్నపూర్ణ స్టూడియోస్, సిరునీ సినీ క్రియేషన్స్ బ్యానర్స్పై అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మాతలుగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఆగస్ట్ 3న సినిమా విడుదలైన ఈ చిత్రం అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో సుశాంత్… తమ సినిమాకు రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాంటున్నాడు.
”ప్రీమియర్ షో నుండి సినిమా పాజిటివ్ టాక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ వచ్చినంత ప్రేక్షకులు థియేటర్కి రావడం లేదేమో అనిపించేది. ఆ సమయంలో నాగార్జున గారు ఈ సినిమా స్లోగా ఎక్కుతుంది అన్నారు. ఆయన అన్నట్లుగానే.. గత శుక్రవారం కంటే ఈ శుక్రవారం అడ్వాన్స్ బుకింగ్ ఎక్కువైంది. మేం ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా డిప్ కాలేదు. నెమ్మదిగా ముందుకెళుతుంది. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.” అన్నాడు.
ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు హీరో రాహుల్ రవీంద్రన్. ఇతడు తన నెక్ట్స్ మూవీని అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై చేయబోతున్నాడు.