జీ ఎక్స్ క్లూజివ్: 'ఉప్పెన'తో హీరో వారసుడు ఎంట్రీ!

Wednesday,April 22,2020 - 12:25 by Z_CLU

కోలీవుడ్ టాప్ హీరోల్లో విజయ్ ఒకడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న విజయ్ త్వరలోనే తన కొడుకు సంజయ్ ను హీరోగా పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నాడు. తన కొడుకు డెబ్యూ మూవీ కోసం తెలుగు రీమేక్ ను ఎంచుకున్నాడు విజయ్. అవును.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఉప్పెన’ సినిమాతో సంజయ్ తమిళ్ లో హీరోగా పరిచయం కానున్నాడని టాక్.

‘ఉప్పెన’ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అతడే ఈ సినిమా కథను విజయ్ కు చెప్పాడు. సంజయ్ తో రీమేక్ చేస్తే బాగుంటుందని కూడా సూచించాడు. విజయ్ సేతుపతి మీద నమ్మకంతో విజయ్ ఈ రీమేక్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

 

ప్రస్తుతం సంజయ్ కెనడాలో ఉంటున్నాడు. అక్కడ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. సంజయ్ ఇండియాకి తిరిగి రాగానే ‘ఉప్పెన’ రీమేక్ పనులు మొదలవుతాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి విజయ్ సేతుపతి నిర్మిస్తాడని తెలుస్తుంది. ఇక ‘ఉప్పెన’ తో దర్శకుడిగా పరిచయమవుతున్న బుచ్చిబాబు తమిళ్ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు.

 

తెలుగులో కల్ట్ క్లాసిక్ గా పేరుతెచ్చుకున్న అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి తన కొడుకు ధృవ్ ను హీరోగా పరిచయం చేశాడు విక్రమ్. ఇప్పుడు విజయ్ కూడా ఇదే బాటలో ఉప్పెన సినిమాను  రీమేక్ చేసి తన కొడుకు సంజయ్ ను పరిచయం చేయబోతున్నాడన్నమాట.