జీ స్పెషల్: విలన్లుగా మారుతున్న హీరోలు

Monday,April 13,2020 - 04:40 by Z_CLU

ఒకప్పుడు విలన్ అంటే ప్రకాష్ రాజ్ లేదా ప్రదీప్ రావత్, ముకేష్ రుషి ఇలా ఓ లిస్టు ఉండేది. కానీ ఇప్పుడు సీను మారింది. ప్రస్తుతం ఒకప్పటి హీరోలు ఇప్పుడు వెండితెరపై విలన్ గా కనిపిస్తూ కొత్తదనానికి నాంది పలుకుతున్నారు. ఇప్పటికే అర్జున్ , జగపతి బాబు, శ్రీకాంత్ లాంటి హీరోలు విలన్లుగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి దారిలోనే మరికొందరు హీరోలు కూడా వెళ్తున్నారు.


అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆ మధ్య వచ్చిన ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ లో విలన్ గా కనిపించాడు హీరో ఉపేంద్ర. ఇప్పుడు మళ్ళీ మహేష్ సినిమాతో మరోసారి తన విలనిజం చూపించబోతున్నాడు. పరశురాం డైరెక్షన్ లో మహేష్ నటించబోయే సినిమాలో మెయిన్ విలన్ గా ఉపేంద్ర ను తీసుకోనున్నారట మేకర్స్. మరి మహేష్ విలన్ గా ఉపేంద్ర ఎలా మెప్పిస్తాడో చూడాలి.

సునీల్ కూడా ఈ కేటగిరిలో చేరిపోయాడు. ‘డిస్కో రాజా’ తో విలన్ అవతారమెత్తి ఇప్పుడు ‘కలర్ ఫోటో’ సినిమాలో మరోసారి విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే కమెడియన్ గా, హీరోగా మెప్పించిన ఈ నటుడు.. విలన్ పాత్రలతో కూడా మంచి గుర్తింపు ఆశిస్తున్నాడు.

ఇక కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా తెలుగులో విలన్ గా పరిచయం అవుతున్నాడు. ఇటివలే ‘సైరా’లో ఓ క్యారెక్టర్ చేసిన విజయ్ ‘ఉప్పెన’ సినిమాతో విలన్ గా మారాడు. సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపిస్తూ తనలోని విలనిజం చూపించబోతున్నాడు ఈ విలక్షణ నటుడు.