మరో సినిమా ప్రారంభించిన కల్యాణ్ రామ్

Sunday,July 30,2017 - 01:02 by Z_CLU

ఓవైపు నిర్మాతగా జై లవకుశ సినిమా నిర్మిస్తున్న నందమూరి కల్యాణ్ రామ్.. సేమ్ టైం హీరోగా కూడా బిజీగా ఉన్నాడు. కాజల్ హీరోయిన్ గా ఇప్పటికే ఎమ్ఎల్ఏ అనే సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చిన కల్యాణ్ రామ్.. ఈరోజు మరో సినిమా ప్రారంభించాడు.

పాపులర్ యాడ్ ఫిలింమేకర్ జయేంద్ర దర్శకత్వంలో కొత్త సినిమా షురూ చేశాడు కల్యాణ్ రామ్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు క్లాప్ కొట్టగా, సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. నందమూరి హరికృష్ణ, రమేష్ ప్రసాద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, దర్శకుడు క్రిష్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో ఈస్ట్-కోస్ట్ ప్రొడక్షన్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. మలయాళీ బ్యూటీ ఐశ్వర్య ఈ సినిమాతో తెలగు తెరకు హీరోయిన్ గా పరిచయమౌతోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామెన్ గా పనిచేయబోతున్నాడు. రెగ్యులర్ షూటింగ్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.