Erra Mallelu - 40 ఏళ్లు పూర్తిచేసుకున్న 'ఎర్ర మల్లెలు'
Saturday,May 01,2021 - 03:40 by Z_CLU
చేసే సినిమాలను బట్టి కొందరు హీరోలకి సెపరేట్ గా అభిమానులు ఉంటారు. తను చేసిన విప్లవ సినిమాలతో అలాంటి అభిమానులను సంపాదించుకున్న రెడ్ స్టార్ మాదాల రంగారావు. అవును ఒక తరంలో మాదాల రంగారావు నటించిన సినిమాలు మంచి వసూళ్ళు రాబట్టి ప్రేక్షకుల్లో చైతన్య తీసుకొచ్చాయి. ఆయన హీరోగా నటించిన ‘ఎర్ర మల్లెలు’ సినిమా నేటితో 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ నటుడిగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేసిన మదాల రంగారావు ‘నవతరం పిక్చర్స్’ అనే సంస్థను నెలకొలిపి తొలి ప్రయత్నంగా ‘యువతరం కదిలింది’ అనే సినిమా తీశారు. ఆ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడంతో అదే కోవలో ‘ఎర్ర మల్లెలు’ అనే మరో విప్లవ సినిమా నిర్మించి నటించారు. 1981 మే 1న విడుదలైన ఈ సినిమా మదాల రంగారావు కి మంచి విజయంతో పాటు రెడ్ స్టార్ అనే బిరుదు తెచ్చింది. వామ పక్ష భావాలతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించారు.
మాదాల రంగారావు కలిసి మురళి మోహన్, సాయి చంద్, గిరిబాబు, చలపతి రావు, రంగనాథ్ ముఖ్య పాత్రల్లో నటించారు. నలబై ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా విడుదలైన అన్ని సెంటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అయి సూపర్ హిట్ అనిపించుకుంది. ఫైనల్ గా మాదాల రంగారావు కెరీర్ లో ఓ మైలు రాయిలా నిలిచిపోయింది. చక్రవర్తి సంగీతం సినిమాకు ఆయువుపట్టులా నిలిచింది. ముఖ్యంగా సినిమాలో “నాంపల్లి టేషను కాడ రాజాలింగో” ఒక ఊపు ఊపేసింది. “నేడే మేడే”, “బంగారు మా తల్లీ భూమీ మా లచ్చిమీ” మిగతా పాటలు కూడా మంచి ఆదరణ పొందాయి.
ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు టి.కృష్ణ కీలక పాత్రలో నటించడం విశేషం. లాయర్ పాత్రలో ఇప్పటి నిర్మాత పోకూరి బాబురావు కనిపిస్తారు. మాదాల రంగారావు తనయుడు మాదాల రవి బాలనటుడిగా నటించాడు. ఈ సినిమాతో నిర్మాతగా, నటుడిగా అభినందనలు అందుకున్న రంగారావు కథకుడిగా కూడా మంచి ప్రశంసలు దక్కించుకున్నారు. ఈ సినిమా సాధించిన విజయంతో మరికొందరు మాదాల రంగారావు ని ఆదర్శంగా తీసుకొని విప్లవ నేపథ్యంతో సినిమాలు చేశారు.
- – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics