Monday,July 18,2016 - 11:14 by zdcl
గద్దె బాబూ రాజేంద్రప్రసాద్ స్వస్థలం నిమ్మకూరు, కృష్ణా జిల్లా (ఏపీ). మాణిక్యాంబ, గద్దె వెంకట నారాయణ దంపతులకు 19 జూలై 1956లో జన్మించారు. సిరామిక్ ఇంజనీరింగ్ లో డిప్లామా పూర్తి చేశారు. విజయ చాముండేశ్వరి ఆయన జీవిత భాగస్వామి. బాలాజీ, శివశంకరి కొడుకు- కోడలు. దిగ్ధర్శకులు బాపు తెరకెక్కించిన ‘స్నేహం’ చిత్రంతో నటుడిగా కెరీర్ ప్రారంభించి, నటుడిగా 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞావంతుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికి 232కి పైగా సినిమాల్లో నటించారు. తమిళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. క్విక్గన్ మురుగన్ చిత్రంతో హాలీవుడ్లోనూ రంగ ప్రవేశం చేశారు. నటకిరీటి, హాస్య కిరిటీ, కామెడీ కింగ్ .. ఇవన్నీ ఆయన బిరుదులు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 1997 ఆగస్టు 27న గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. విశ్వవిఖ్యాత, పద్మశ్రీ నందమూరి తారకరామారావుని తన ఇలవేలుపుగా భావిస్తారాయన. పరిశ్రమలో అందరి బంధువుగా, గొప్ప స్నేహశీలిగా, ఆత్మీయుడుగా పేరు తెచ్చుకున్నారు. తుదిశ్వాస వరకూ నటనే తపనతో జీవిస్తానని చెబుతారాయన. ప్రస్తుతం నటనలో కొనసాగుతూనే.. మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో మంచి పనులు చేస్తున్న రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..