నటుడు నర్సింగ్ యాదవ్ కన్నుమూత

Friday,January 01,2021 - 10:38 by Z_CLU

ప్రముఖ టాలీవుడ్ నటుడు నర్సింగ్ యాదవ్ నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.

కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు నర్సింగ్ యాదవ్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో డయాలసిస్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆరోగ్యం విషమించడంతో నర్సింగ్ యాదవ్ తుదిశ్వాస విడిచారు.

కెరీర్ లో 300కు పైగా సినిమాల్లో నటించారు నర్సింగ్ యాదవ్. ప్రారంభంలో విలన్ వేషాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, ఆ తర్వాత ఊహించని విధంగా కామెడీ పాత్రల్లో కూడా రాణించి మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు.

విజయనిర్మల దర్శకత్వంల వచ్చిన హేమాహేమీలు మూవీ నర్సింగ్ యాదవ్ తొలి చిత్రం. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్ కు ఆర్జీవీ బ్రేక్ ఇచ్చాడు. క్షణక్షణం సినిమా నర్సింగ్ కు టర్నింగ్ పాయింట్. దీంతో పాటు ఇడియట్, గాయం, పోకిరి, మాస్టర్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అన్నవరం, బద్రి.. ఇలా వందల సినిమాల్లో నటించారు నర్సింగ్.

నర్సింగ్ అసలు పేరు మైలా నరసింహ యాదవ్. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నారు.