ప్రభాస్ ఆదిపురుష్ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్స్ లాక్ అయ్యారు. బాలీవుడ్ లో విలక్షణ కంపోజర్స్ గా పేరు తెచ్చుకున్న సచేత్-పరంపర ద్వయం ఈ సినిమాకు సంగీతం అందించబోతోంది. గతంలో ఓం రౌత్ డైరక్ట్ చేసిన తానాజీ సినిమాకు వీళ్లే సంగీతం అందించాడు. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడు తీస్తున్న ఆదిపురుష్ కు కూడా సంగీతం అందించే అవకాశం దక్కించుకున్నారు.
ఈ మ్యూజిక్ డైరక్టర్స్ కు ప్రభాస్ తో కూడా చిన్న సంబంధం ఉంది. ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో సైకో సయ్యాన్ అనే పాటను కంపోజ్ చేసింది వీళ్లే. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాకు వర్క్ చేసే అవకాశం వీళ్లకు దక్కిందన్నమాట. సాహోకు కేవలం ఒక పాటకు మాత్రమే పనిచేసిన వీళ్లు.. ఈసారి ప్రభాస్ మూవీ మొత్తానికి మ్యూజిక్ అందించే ఛాన్స్ కొట్టేశారు.
ఇక ప్రభాస్ సినిమాల మ్యూజిక్ డైరక్టర్స్ విషయానికొస్తే.. అతడి సినిమాలకు మ్యూజిక్ డైరక్టర్లను ఆలస్యంగా సెలక్ట్ చేస్తుంటారు. సాహో సినిమాకు చాన్నాళ్ల వరకు సంగీత దర్శకుల పేర్లు చెప్పలేదు. ఇక రాధేశ్యామ్ కైతే దాదాపు 50శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత సంగీత దర్శకుడి పేరు చెప్పారు. ఇప్పుడు ఆదిపురుష్ కు కూడా ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత, కాస్త ఆలస్యంగా సంగీత దర్శకుడి పేరును వెల్లడించారు.
ఇక సాచెత్-పరంపర విషయానికొస్తే, హిందీలో కంపోజ్ చేసిన శివతాండవం ట్రాక్ తో వీళ్లు బాగా పాపులర్ అయ్యారు. ఇప్పటికి వాయిద్యాలకు ఫ్యూజన్ జోడించి వీళ్లు కంపోజ్ చేసిన శివతాండవం సూపర్ హిట్టయింది. ఆ తర్వాత కబీర్ సింగ్, స్ట్రీట్ డాన్సర్ లాంటి సినిమాలకు హిట్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న జెర్సీకి కూడా వీళ్లే సంగీతం అందిస్తున్నారు.
- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics