మహేష్ మూవీపై రూమర్.. నిజం లేదన్న దర్శకుడు

Saturday,March 10,2018 - 02:25 by Z_CLU

మహేష్ అప్ కమింగ్ మూవీపై కొన్ని రోజులుగా ఓ వెరైటీ పుకారు షికారు చేస్తోంది. అది కూడా అతడి ప్రతిష్టాత్మక 25వ చిత్రంపై కావడం విశేషం. త్వరలోనే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు సూపర్ స్టార్. ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్ సిరీస్ నుంచి స్పూర్తి పొంది ఈ సినిమాకు కథ రాసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఈ వార్తల్లో నిజం లేదంటున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ట్విట్టర్ ఛాటింగ్ లో భాగంగా ఈ రూమర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. తను రాసుకున్న కథ ఓ సిరీస్ లేదా సినిమా నుంచి స్పూర్తి పొంది రాసుకున్నది కాదని అంటున్నాడు పైడిపల్లి.

గతంలో ఇతడు తీసిన ఊపిరి సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా ఆధారంగా తెరకెక్కింది. ఆ మూవీ తర్వాత మహేష్ తో వస్తున్న సినిమా కాబట్టి, ఇది కూడా ఎక్కడ్నుంచో ఇన్ స్పైర్ అయి చేశారంటూ వార్తలొచ్చాయి. వంశీ పైడిపల్లి క్లారిటీతో ఈ పుకార్లు ఆగిపోయాయి.

దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ బ్యానర్లపై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్ గా నటించనుంది. అల్లరి నరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.