ఈ దర్శకులకు దారేది..?

Friday,March 17,2017 - 09:07 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో కొందరు టాప్ డైరెక్టర్స్ ను ఎక్కడికి వెళ్లినా వెంటాడుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. ‘నెక్స్ట్ ఏంటి ?’.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ థియేటర్స్ లో ఫాన్స్ ను ఖుషి చేసే కొందరు దర్శకులు వాళ్ళ నెక్స్ట్ వెంచర్ పై మాత్రం నోరు విప్పడం లేదు..


ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి బాహుబలి-2 తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా.. ఏ హీరోతో చేస్తాడా..అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. బాహుబలి-2 రిలీజ్ కు రెడీ అయిపోవడంతో జక్కన్న ఎక్కడికెళ్లినా నెక్స్ట్ ఏంటి..? అనే అడుగుతున్నారు. అయితే రాజమౌళి మాత్రం పార్ట్-2 రిలీజ్ అవ్వగానే ఓ హాలిడే టూర్ ప్లాన్ చేశాడు.. 2-3 నెలలు రెస్ట్ తీసుకున్న తర్వాతే నెక్ట్స్ ఏంటని ఆలోచిస్తాడట.


సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావుని కూడా నెక్ట్ ఏంటనే ప్రశ్న వెంటాడుతుంది. నాగార్జునతో ‘ఓం నమో వేంకటేశాయ’ అనే భక్తిరస సినిమాను రూపొందించిన రాఘవేంద్రరావు నెక్స్ట్ తన నెక్ట్స్ ప్రాజెక్టుపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. అయితే టైం తీసుకుంటాడని మాత్రం తెలుస్తోంది.


‘ఖైదీ నంబర్ 150’తో గ్రాండ్ హిట్ అందుకున్న వినాయక్ ని కూడా నెక్స్ట్ ఏంటి అనే క్వశ్చన్ ఇబ్బందిపెడుతోంది. మొన్నటివరకూ సాయి ధరమ్ తేజ్ తో వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడనే వార్త వినిపించింది. అయితే అలాంటిదేం లేదని స్వయంగా తేజూ క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో వినాయక్ నెక్స్ట్ మూవీపై సస్పెన్స్ కొనసాగుతోంది.


‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న దర్శకుడు క్రిష్ కూడా తన నెక్స్ట్ సినిమాపై ఇంకా ఎలాంటి క్లారిటీకి రాలేదు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేస్తాడనే వార్త వినిపిస్తున్నప్పటికీ… క్రిష్ మాత్రం దీనిపై రియాక్ట్ అవ్వడం లేదు.


‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా తర్వాత ఇప్పటివరకూ తన నెక్స్ట్ సినిమా ఏంటో అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు గుణశేఖర్. రుద్రమదేవి తర్వాత ‘ప్రతాపరుద్రుడు’ అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేసినప్పటికీ… ఇప్పటివరకూ ఆ సినిమా గురించి కూడా ప్రకటన చేయలేదు గుణ.


‘నెక్స్ట్ ఏంటి’ లిస్ట్ లో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఉన్నాడు. పల్లెటూరి వాతావరణం, కోస్తా యాసతో సినిమాలు చేసి ఎంటర్ టైన్ చేసే అడ్డాల…. ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఇప్పటివరకు ఇంకో సినిమా ఎనౌన్స్ చేయలేదు.