టాలీవుడ్ నుంచి వెల్లువెత్తుతున్న విరాళాలు-5
Tuesday,March 31,2020 - 12:29 by Z_CLU
ప్రభాస్
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి పాటిస్తున్న లాక్ డౌన్ వలన షూటింగ్లు లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ చారిటీ’ (సి సి సి) కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రూ. 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించాడు. ప్రభాస్ ఇది వరకే కరోనా నిర్మూలన చర్యల కోసం PM రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాలకు 1 కోటి రూపాయలు సహాయం అందించారు. ఈ రోజు ప్రకటించిన 50 లక్షల రూపాయల తో ప్రభాస్ కరోనా పై పోరాటానికి 4 కోట్ల 50 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
సుశాంత్
‘కరోనా క్రైసిస్ చారిటీ’కి హీరో సుశాంత్ రూ. 2 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు. “ఇవి ఒకరినొకరు చూసుకోవాల్సిన రోజులు. ఈ సంక్షోభ సమయంలో దినసరి వేతనంతో జీవనం సాగించే సినీ కార్మికులను ఆర్థికంగా ఆదుకోవడానికి నా వంతు చిన్న సాయంగా రూ. 2 లక్షలు కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తానని వినమ్రంగా తెలియజేస్తున్నా. అందరూ తమ తమ ఇళ్లల్లో సురక్షితంగా ఉండాల్సిందిగా కోరుతున్నా” అని ట్వీట్ చేశారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్
కరోనా క్రైసిన్ చారిటీ (సీసీసీ)కి షైన్ స్క్రీన్స్ బ్యానర్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది రూ. 5 లక్షల విరాళం ప్రకటించారు. దినసరి వేతనం మీద ఆధారపడి బతికే పేద కళాకారులు, సినీ కార్మికులను ఆదుకోవాలనే పెద్ద మనసుతో ఏర్పాటైన సీసీసీకి తమ వంతుగా ఈ చిన్న ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామని వారు తెలిపారు.
నారా రోహిత్
కరోనా మహమ్మారిపై యుద్ధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని హీరో నారా రోహిత్ పిలుపునిచ్చారు. ఆ పోరాటంలో తన వంతుగా రూ. 30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ.10 లక్షలు, ప్రధాన మంత్రి సహాయ నిధికి మరో రూ.10 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు తెలిపారు.
సందీప్ కిషన్
మెగాస్టార్ చిరంజీవి ఛైర్మన్గా ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)కి సందీప్ కిషన్ రూ. 3 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో పాటు తన రెస్టారెంట్లలో పనిచేస్తున్న 500కు పైగా ఉద్యోగుల బాగోగులను సైతం ఆయన చూసుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం కీలక దశలో ఉందనీ, దీన్ని సమర్థంగా ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన లాక్డౌన్ను అందరూ గౌరవించాలనీ, వైద్యులు, పోలీసుల సూచనలను పాటిస్తూ, అందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సందీప్ కిషన్ కోరారు.
నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ ఈమధ్య 8 లక్షల విలువ చేసే మాస్కులు, శానిటరీ కిట్లు వివిధ ఆసుపత్రుల్లో ఉన్న వైద్యలుకు అందించాడు. తాజాగా వివిధ ఏరియాల్లో డ్యూటీ చేస్తున్న పోలీస్ సిబ్బందికి శానిటైజర్లు అందజేశాడు. ఇక్కడితో తన ఛారిటీ ఆగదని, మరిన్ని రోజుల పాటు దీన్ని ఇలానే కొనసాగిస్తున్నట్లుగా నిఖిల్ సిద్ధార్థ తెలిపారు.