సంక్రాంతి వార్: రూ.250 కోట్లు బెట్టింగ్

Saturday,December 21,2019 - 03:47 by Z_CLU

ఈ సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో భారీ పుంజులు పందానికి సిద్ధమయ్యాయి. ఈ పందెం రేటు ఎంతో తెలుసా.. అక్షరాలా 250 కోట్ల రూపాయలు. అవును.. టాలీవుడ్ స్టార్స్ మహేష్, బన్నీ సై అంటే సై అంటూ పోటీ పడుతుంటే.. పించ్ హిట్టర్స్ లా రజనీకాంత్, కల్యాణ్ రామ్ కూడా సమరానికి సై అంటున్నారు.

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వురు’ మూవీని ఇప్పటికే 110 కోట్లకు అమ్మారని టాక్. నిజానికి మహేష్ కు 110 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ కొత్తేంకాదు. సంక్రాంతి సినిమా కాబట్టి నంబర్ ఇంకాస్త పెద్దగానే ఉండొచ్చు. అటు
బన్నీ చేస్తున్న ‘అల వైకుంఠపురం’ సినిమా బిజినెస్ జోరుగా సాగుతోంది. అటుఇటుగా 90-95 కోట్ల మధ్య థియేట్రికల్ చేసే ఛాన్స్ ఉంది.

ఈ రెండు సినిమాలే అటుఇటుగా 200 కోట్ల బిజినెస్ చేస్తుండగా.. బరిలో ఇంకా రజనీకాంత్, కల్యాణ్ రామ్ ఉండనే ఉన్నారు. రజనీకాంత్ దర్బార్ మూవీని దిల్ రాజు నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ 30 కోట్ల రూపాయలకు క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అటు కల్యాణ్ రామ్ చేస్తున్న ఎంతమంచివాడవురా సినిమా 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయబోతోంది. సో.. ఈ సినిమాలన్నీ కలిపి 250 కోట్లపైనే బిజినెస్ చేస్తున్నాయి.

సంక్రాంతిని ఎప్పట్లానే సూపర్ స్టార్ షురూ చేస్తున్నాడు. దర్బార్ సినిమా జనవరి 9న వస్తోంది. ఆ తర్వాత 11న సరిలేరు నీకెవ్వరు, 12న అలవైకుంఠపురములో, 15న ఎంతమంచివాడవురా సినిమాలు వరుసగా బరిలోకి దిగుతున్నాయి.