రీతూ వర్మకు జాక్‌పాట్‌

Monday,August 08,2016 - 07:00 by Z_CLU

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించడమే లక్ష్యంగా సంస్థ అధినేత అభిషేక్ నామా ఇటీవల ఐదు చిత్రాలను ప్రకటించిన విషయం విదితమే. అందులో ‘గూఢచారి’ ఒకటి. ‘క్షణం’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత అడవి శేష్‌ హీరోగా నటించనున్న సినిమా ఇది. ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో అభిషేక్‌ పిక్చర్స్‌ ఈ సినిమాని నిర్మించనుంది. శశి తిక్క, రాహుల్‌ ద్వయం దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అడవి శేష్ సరసన హీరోయిన్‌గా పలువురు స్టార్స్‌ పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే.. ‘పెళ్లిచూపులు’లో రీతూ వర్మ నటన చూసి ఆమెను ఎంపిక చేశారు. ఇప్పటివరకూ ‘ప్రేమ ఇష్క్‌ కాదల్‌’, ‘నా రాకుమారుడు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ వంటి సినిమాల్లో నటించిన రీతూ వర్మ ఈ భారీ సినిమాలో అవకాశం రావడంతో సంతోషం వ్యక్తం చేశారు. ‘గూఢచారి’తో భారీ హిట్‌ అందుకోవడం ఖాయమని అంటున్నారామె. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది.