ఫ్యాషన్ డిజైనర్ సాంగ్ లాంచ్ చేసిన రవితేజ
Monday,May 01,2017 - 04:26 by Z_CLU
ముప్పై సంవత్సరాల క్రితం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్రానికి సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ నాలుగవ పాటను మాస్ మహారాజా రవితేజ తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు. ‘మేఘాలే తేలే నాలోనా…’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను శ్రీమణి రాయగా, సాయి చరణ్, సాహితి చాగంటి పాడారు.
ఈ సందర్భంగా రవితేజ ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ టీమ్ కు శుభాకాంక్షలు అందజేశారు. మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన ‘అన్వేషణా…’ అనే మూడవ పాట, అంతకుముందు విడుదల అయిన ‘పాపికొండల్లో, రవివర్మ చిత్రమా..’ అనే పాటలు ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొంది, టాప్ ఫైవ్ చార్ట్ బస్టర్స్ లో నిలిచాయి.
ఫ్యాషన్ డిజైనర్ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.