నిశ్శబ్దం ట్రయిలర్.. సైలెన్స్ లో వయొలెన్స్

Friday,March 06,2020 - 05:52 by Z_CLU

లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదలవుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న చిత్రమిది. ఈ సినిమా ట్రయిలర్ ను నేచురల్ స్టార్ నాని రిలీజ్ చేశాడు.

కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ అసోసియేషన్ లో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మాణంలో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అత్యధిక భాగం అమెరికాలో షూట్ చేశారు.

ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. సినిమా అంతా క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. ట్రైలర్ ప్రారంభంలోనే ఒక అమెరికన్ న్యూస్ రిపోర్టర్ “దెయ్యాల కొంప అనే పేరున్న వుడ్ సైడ్ విల్లా ఈరోజు మరోసారి వార్తల్లోకి వచ్చింది” అన చెప్తుంది.‘అక్క‌డ చీక‌ట్లో ఎవ‌రో ఎటాక్ చేశారంటా..కానీ ఎవ‌రో ఏంటో క‌నిపించ‌లేదంటున్నారు’ అనే డైలాగ్‌ లు వినిపిస్తాయి. అంజలి ఈ కేసును విచారణ చేస్తూ ఉంటుంది.

ఓ పాడుబ‌డిన ఇంట్లో ఉన్న అనుష్క‌, మాధ‌వ‌న్ కొన్ని భ‌యాన‌కమైన విష‌యాల‌ు చూస్తార‌ు. అస‌లు ఆ ఇంట్లో ఏముందోన‌ని పోలీసులు అన్వేష‌ణ‌తోనే సినిమా ర‌న్ అవుతుంద‌ని తెలుస్తుంది. మరో హీరోయిన్ అంజ‌లి అమెరిక‌న్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంది. ఆమె అనుష్క‌కి ఏదో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. అనుష్క మూగ-చెవిటి అమ్మాయి సాక్షి పాత్రలో న‌టించింది. ట్రయిలర్ లో ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

అస‌లు ఘోస్ట్ హౌస్ ఏంటి? అందులో జ‌రిగే క‌థేంటి? అనేది ఈ ‘నిశ్శ‌బ్దం’ కథ. ఏప్రిల్ 2న సినిమా థియేటర్లలోకి రానుంది.