రాధమ్మ కూతురు సీరియల్ లో హీరో నిఖిల్

Monday,July 25,2022 - 12:04 by Z_CLU

టాలీవుడ్ లో సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇంటర్వ్యూలు, నాన్-ఫిక్షన్ కార్యక్రమాల్లో పాల్గొనడం రొటీన్ అయిపోయింది. దీంతో స్టార్ హీరోలు ఇప్పుడు సీరియల్స్ లోకి ఎంటరయ్యారు. తన కొత్త సినిమా కార్తికేయ-2 ప్రచారం కోసం హీరో నిఖిల్, ఓ సీరియల్ లో నటించాడు.

జీ తెలుగులో ప్రతి రోజు సాయంత్రం 7 గంటలకు ప్రసారమయ్యే రాధమ్మ కూతురు సీరియల్ లో నిఖిల్ నటించాడు. ఓ ఫైట్ సీక్వెన్స్ లో కనిపించడంతో పాటు, సీరియల్ ను మలుపుతిప్పే కీలకమైన సన్నివేశంలో కూడా కనిపించాడు. “ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కటి, ప్రతి ఒక్కరితో సంబంధమే, ప్రతిది ఇంటర్ లింక్డే” అంటూ తన కార్తికేయ-2 సినిమాలోని డైలాగ్ ను రాధమ్మ కూతురులో వినిపించాడు.

ఈ సీరియల్ షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను షేర్ చేశాడు నిఖిల్. ఇలా కార్తికేయ-2 సినిమాకు వినూత్నంగా ప్రచారం కల్పిస్తున్నాడు.

ఆగస్ట్ 12న థియేటర్లలోకి రాబోతోంది కార్తికేయ-2. ఈ సినిమా ప్రచారానికి ఇంకా చాలా టైమ్ ఉంది. కాబట్టి ఈ గ్యాప్ లో మరిన్ని డిఫరెంట్ ప్రమోషనల్ ఐడియాస్ ను తెరపైకి తీసుకురాబోతోంది కార్తికేయ-2 టీమ్. ఇందులో భాగంగా మరికొన్ని ట్రయిలర్స్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు.

చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. కాలభైరవ ఈ సినిమాకు సంగీతం అందించాడు.