నాని "నేను లోకల్" ప్రారంభం

Wednesday,August 10,2016 - 03:25 by Z_CLU

 

వరుస విజయాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని హీరో గా, నిర్మాత దిల్ రాజు ఒక నూతన చిత్రాన్ని ప్రారంభించారు. ఈ చిత్రానికి “నేను లోకల్” టైటిల్ ను ఖరారు చేసారు యూనిట్. “ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్”. అనేది కాప్షన్.

“సినిమా చూపిస్తా మామా” చిత్ర దర్శకుడు త్రినాథ రావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. నేను శైలజా సినిమా తో తెలుగు లో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఈ చిత్రం లో నాని సరసన నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రం ముహూర్తపు పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగింది. హీరో నాని, కీర్తి సురేష్, దిల్ రాజు, శిరీష్,దర్శకులు త్రినాథ రావు మరియు ఇతర యూనిట్ సభ్యులు తో పాటు అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమినీ కిరణ్, స్రవంతి రవి కిశోర్, దానయ్య, నవీన్ యెర్నేని, దాము కానూరి, ఠాగూర్ మధు, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి తదితరులు అతిధులు గా గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ” ‘సినిమా చూపిస్తా మామా’ చిత్రం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. దర్శకులు త్రినాధ్ నాకు ఈ కథ చెప్పగానే వెంటనే నచ్చింది. ఎప్పటినుండో నాని తో ఒక సినిమా తీయాలని అనుకుంటున్నా అనివార్య కారణాల వలన కుదరలేదు. ఈ కథ వినగానే నాని హీరో గా బాగుంటాడు అనుకుని అడగటం జరిగింది. నాని కూడా వెంటనే ఓకే చెప్పాడు. క్యారెక్టర్ బేస్డ్ లవ్ స్టోరీ ఇది. మా బ్యానర్ లో ఆర్య వంటి క్యారక్టరైసేషన్ బేస్డ్ లవ్ స్టోరీ ఎంతటి పేరు తెచ్చిందో ఈ చిత్రం కూడా అంతే పేరు తెస్తుంది. ఆగస్ట్ 15 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యి, ఈ సంవత్సరం చివరి భాగం లో విడుదల చేసే విధం గా ప్లాన్ చేస్తున్నాం “, అని తెలిపారు.

హీరో నాని మాట్లాడుతూ, ” రియల్ లైఫ్ ఎంతో డ్రమాటిక్ గా జరుగుతోంది. ఒక చిత్రం 50 డేస్ పూర్తి చేసుకుంది. ఒకటి విడుదలకు సిద్ధం అవుతోంది. మరొకటి ఇవాళ ప్రారంభం అయింది. కొన్ని కథలు చూసి ఎంజాయ్ చేస్తాం. ఈ కథ మాత్రం వింటూనే ఎంజాయ్ చేశాను. దిల్ రాజు గారి కి నాకు వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవుతుంది. ఆయన తో పని చేయటం ఆనందం గా ఉంది. దర్శకులు త్రినాధ్ గారు చాలా బాగా తీస్తారు అనుకుంటున్నా. కీర్తి సురేష్ మా సినిమా లో హీరోయిన్ గా చేస్తోంది. ఆమె చేసిన రజిని మురుగన్ సినిమా చాలా నచ్చింది. తాను ఈ సినిమా లో రోల్ కి పర్ఫెక్ట్ అనిపించింది. హీరో గా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమా లోఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది”, అని అన్నారు.

దర్శకులు త్రినాథ రావు మాట్లాడుతూ , ” నాకు ఉన్న చాలా ఇష్టాలు ఈ చిత్రం తో తీరుతున్నాయి. దిల్ రాజు గారి ప్రొడక్షన్ లో చేయాలనీ ఎప్పటినుండో అనుకుంటున్నా. హీరో నాని ఒక నాచురల్ యాక్టర్ . ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. అలాగే దేవి శ్రీ ప్రసాద్ గారి సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఈ కోరికలన్నీ ఈ చిత్రం తో తీర్చుకుంటున్నా. కథ లో మంచి ఎనర్జీ ఉంటుంది. మీ ముందుకు ఒక మంచి లవ్ ఎంటర్టైనర్ తో వస్తాం”, అన్నారు

రచయిత ప్రసన్న మాట్లాడుతూ, ” నా సినిమా లో హీరో లు మారుతున్నారు గానీ దర్శకుడు కాదు. త్రినాథ రావు గారు ఈ చిత్రాన్ని కూడా విజయవంతం గా తీస్తారు అని అనుకుంటున్నా. హీరో నాని తో చేయాలనీ, దిల్ రాజు గారి నిర్మాణం లో పని చేయాలనీ ఎప్పటినుండో ఆశ పడుతున్నా. ఈ చిత్రం తో ఆ కోరిక నెరవేరుతోంది” అన్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి నిజార్ షఫీ, సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, కథ – స్క్రీన్ప్లే – మాటలు : ప్రసన్న కుమార్ బెజవాడ, రచన : సాయి కృష్ణ, స్క్రీన్ప్లే – దర్శకత్వం – త్రినాథ రావు నక్కిన, అసోసియేట్ ప్రొడ్యూసర్ : బెక్కెం వేణుగోపాల్, సహ నిర్మాత : హర్షిత్ రెడ్డి, నిర్మాత : శిరీష్, సమర్పణ : దిల్ రాజు

ఇతర తారాగణం, మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే విడుదల చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.