ప్రస్తుతం రీమేక్స్ తో పాటు సీక్వెల్ ట్రెండ్ కూడా మొదలైంది. ఇద్దరు సీనియర్ హీరోలు ఒకేసారి సీక్వెల్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘దృశ్యం’ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయింది. దృశ్యం సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో మళ్ళీ దానికి సీక్వెల్ చేశాడు వెంకీ. కాకపోతే రెండూ రీమేక్ సినిమాలే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన రెండు సినిమాలను వెంకీ తెలుగులో రీమేక్ చేశాడు. ‘దృశ్యం 2’ ఈ నెల 25న డైరెక్ట్ గా OTT లో రిలీజ్ అవ్వబోతుంది.
ఇక కింగ్ నాగార్జున కూడా ఓ క్రేజీ సీక్వెల్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ సినిమానే ‘బంగార్రాజు’. నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య కూడా తండ్రితో కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై మంచి బజ్ నెలకొంటుంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో థియేటర్స్ లోకి రానుంది.
నిజానికి ఇటు వెంకీ అటు నాగ్ ఇద్దరూ ఈ సీక్వెల్స్ ఎంచుకోవడానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఈ రెండు సీక్వెల్స్ లో ఉన్నవి ఛాలెంజింగ్ రోల్స్. పైగా ఒకసారి చేసిన పాత్రలే. ఆడియన్స్ మెచ్చిన సినిమాలకు కొనసాగింపుగా వస్తున్న సినిమాలు. కాకపోతే వెంకటేష్ ‘దృశ్యం2’ సినిమాను OTT కోసమే చేస్తే నాగ్ మాత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరహాలో మళ్ళీ కలెక్షన్స్ రాబట్టాలని థియేటర్స్ కోసం చేస్తున్నాడు. ఏదేమైనా ఈ రెండు సీక్వెల్స్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. చూడాలి ఈ సీక్వెల్స్ తో సీనియర్ హీరోలు ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటారో మరి.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics