నాగ్ ను ఆకాశానికెత్తేసిన మెగాస్టార్
Friday,February 10,2017 - 10:26 by Z_CLU
అక్కినేని నాగార్జున దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన ఓం నమో వేంకటేశాయ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. విడుదలైన అన్ని సెంటర్ల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. విడుదలకు ఒక్క రోజు ముందు.. ప్రముఖుల కోసం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ కు చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. సినిమా చూసిన చిరు, నాగ్ యాక్టింగ్ కు మెస్మరైజ్ అయ్యారు. ఇలాంటి సినిమా చేయాలంటే అది నాగార్జునకే సాధ్యమన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – “ఓం నమో వేంకటేశాయ సినిమా చూడటమే వండర్ ఫుల్ ఎక్స్పీరియెన్స్. భక్తి పారవశ్యాలు పెల్లుబుకుతాయి. సెకండాఫ్ హృధ్యంగా ఉండటమే కాదు, సెకండాఫ్ అంతా కళ్ళు చెమర్చాయి. ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంది. సినిమా చూడటం భక్తితో కూడిన ప్రయాణం చేసినట్టు అనిపించింది. ఇలాంటి సినిమా తీయాలంటే రాఘవేంద్రరావుగారు, చెయ్యాలంటే నా మిత్రుడు నాగార్జున, తెరకెక్కించాలంటే నిర్మాత మహేష్రెడ్డికే చెల్లుతుంది. గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీసాయి చిత్రాలకు ధీటుగా ఉండే చిత్రం. నాగార్జున కెరీర్లో కలికుతురాయిలాంటి చిత్రం ఓం నమో వేంకటేశాయ. రాఘవేంద్రరావుగారు అద్భుతంగా తీస్తే..నటీనటులు, టెక్నిషియన్స్ ఇంకా గొప్పగా చేశారు. సినిమా చూస్తే దివ్యానుభూతికి లోనవుతారు“ అన్నారు.