పుకార్లు ఖండించిన హీరో

Tuesday,July 07,2020 - 06:51 by Z_CLU

దాదాపు 3 రోజులుగా ఓ పుకారు బ్రహ్మాండంగా చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అది రూమర్ అని తెలిసి కూడా వైరల్ చేశారు. ఇంతకీ ఏంటా పుకారు అనుకుంటున్నారా.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మంచు మనోజ్ ను విలన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ ప్రతిపాదనకు ఇటు మంచు మనోజ్, అటు ఎన్టీఆర్ ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

3 రోజులుగా చక్కర్లు కొడుతున్న ఈ పుకారును ఖండించాడు మంచు మనోజ్. ఎన్టీఆర్ సినిమా నుంచి తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని స్పష్టంచేశాడు. విలన్ పాత్రలకు తను వ్యతిరేకం కాదని, అయినప్పటికీ ఇప్పటికిప్పుడు విలన్ పాత్రలో కనిపించే ఉద్దేశం తనకు లేదని అంటున్నాడు మనోజ్.

“ఒక్కడు మిగిలాడు” అనే సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు మంచు మనోజ్. చాలా గ్యాప్ ఇచ్చి అహం బ్రహ్మస్మి అనే ప్రాజెక్టు స్టార్ట్ చేశాడు. ఈ సినిమాలో హీరోగా నటిస్తూ, తనే స్వయంగా నిర్మాతగా కూడా మారాడు.

పాన్-ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే ప్రస్తుతం తన దృష్టి మొత్తం పెట్టాడు మనోజ్. ఇది పూర్తయిన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తానని ప్రకటించాడు.