Matrudevobhava - స్టార్ హీరోయిన్ తో రీమేక్!

Thursday,April 22,2021 - 03:59 by Z_CLU

కొన్ని సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఏడిపించి కన్నీళ్ళతో కలెక్షన్స్ రాబడతాయి. అందులో అగ్ర స్థానంలో ఉంటుంది ‘మాతృదేవోభవ’ సినిమా. ఈ సినిమా చూస్తూ ఏడవకుండా ఉండని ప్రేక్షకుడు ఉండడు. అందుకే ఇరవై ఏడేళ్ళయినా ఈ క్లాసిక్ సినిమా గురించి ఇప్పటికీ సినిమా లవర్స్ మాట్లాడుకుంటారు. హీరోయిన్ మాధవి తో దర్శకుడు అజయ్ కుమార్ తెరకెక్కించిన ఈ రీమేక్ సినిమాను ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేయాలనుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు నిర్మాత కే.ఎస్.రామారావు.

Matrudevobhava movie special zeecinemalu 3

మాతృత్వంలోని మాధుర్యాన్ని చూపించి గుండెల్ని పిండేసి కంటతడి పెట్టించిన ఈ సినిమాను ఇప్పటి ప్రేక్షకులకు చూపించాలనుందని ఆయన అన్నారు. అమ్మ గొప్పదనం తెలియజేసే అలాంటి గొప్ప కథలు ఇప్పుడు రావడం లేదని, మాతృదేవోభవ లాంటి సినిమాను టివీ లో కాకుండా థియేటర్స్ లో చూడాలని అందుకే తను ఈ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నానని చెప్పారు రామారావు.

Director-Ajay-Kumar-Producer-KS-Rama-Rao1

దర్శకుడు అజయ్ కుమార్ నిర్మాత కేఎస్ రామారావు

అయితే రోజూ ఈ సినిమా రీమేక్ గురించి ఆలోచిస్తానని ఈ కథకి అనుష్క, నయనతార, కీర్తి సురేష్ లు సరిగ్గా సరిపోతారని వాళ్ళు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నానని అన్నారు. ఇక నయనతారతో ఈ రీమేక్ సినిమా తీస్తే రెస్పాన్స్ ఇంకా బాగుంటుందని తను అభిప్రాయ పడుతున్నానంటూ తెలిపారు.

Nayanthara Vignesh Shivan

“కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్ తో సినిమా తీసే ప్రయత్నం చేయలేం. రెమ్యునరేషన్స్ వింటేనే కంగారు వచ్చే పరిస్థితి ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలి. అందుకే కాస్త ఈ రీమేక్ ఆలస్యం అవుతుంద”ని చెప్పుకొచ్చారు అగ్ర నిర్మాత.

ఇక అదే ఇంటర్వ్యూలో ‘మాతృదేవోభవ’ వంద రోజుల వేడుకలో కెమెరామెన్ చోటా కే నాయుడు ని వేదికపైకి పిలవలేనందుకు సారీ చెప్తూ ఆ జ్ఞాపకాలను పంచుకున్నారు నిర్మాత. ఇక అలనాటి ఈ క్లాసిక్ సినిమాను మళ్ళీ తీస్తే అదే రెస్పాన్స్ వస్తుందా ? లేదా అనేది పక్కన పెడితే ఇప్పటి సమాజానికి ఇలాంటి మంచి కథలు చెప్పాలని స్క్రీన్ పై చూపించాలని అంటున్నారు నిర్మాత రామారావు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics