'కణం' ఎంతో ఇష్టపడి చేసిన సినిమా - సాయిపల్లవి

Saturday,March 03,2018 - 11:04 by Z_CLU

‘ఛలో’తో సూపర్‌హిట్‌ కొట్టిన నాగశౌర్య, ‘ఫిదా’, ‘ఎంసిఎ’ వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చిన సాయిపల్లవి కలిసి ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైౖకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘కణం’ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయిన ‘కణం’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ మార్చి 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఎన్‌విఆర్‌ సినిమా అధినేత చెప్పారు.

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ ”ఫిదా’, ‘ఎంసిఎ’ చిత్రాల్ని అపూర్వంగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ‘కణం’ చిత్రం తల్లి, కూతురికి మధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. నేను ఏదైనా సినిమా చేస్తున్నప్పుడు అందులో నా పాత్రకి ఎలా న్యాయం చేయగలను అనేది చూసుకుంటాను. విజయ్‌గారు ఈ కథ చెప్పి, ఇందులో నేను తల్లి పాత్ర చేయాలి అని అడిగినప్పుడు ఈ పాత్రలోని ఎమోషన్స్‌ని పండించగలనా అనుకున్నాను. ఎందుకంటే ఇలాంటి పాత్ర ఇది వరకు నేను చేయలేదు.

విజయ్‌ గారు, నేను సినిమా గురించి చాలా చర్చించుకున్నాం. చిత్రంలో నా కూతురిగా కనిపించే వెరోనికాతో చాలా సమయం గడిపాను. తాను నేను నిజంగానే తల్లీకూతుళ్ల లాగ కలిసిపోయాం. అందువల్ల సినిమాలో కనిపించే ఎమోషన్స్‌ అన్ని చాలా సహజంగా ఉంటాయి. నటిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది. పాత్రని ఎంతో ఇష్టపడి చేసాను.” అన్నారు.