Interview - కిషోర్ (శ్రీకారం మూవీ)

Monday,March 15,2021 - 12:10 by Z_CLU

‘‘వ్యవసాయం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా శ్రీకారం సినిమాలో ఎవరు చెప్పని, చూపించిన విషయాలను ప్రస్తావించాము. వీటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు దర్శకుడు కిశోర్‌. వెర్సటైల్‌ యాక్టర్‌ శర్వానంద్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన చిత్రం శ్రీకారం. మహాశివరాత్రి కానుకగా మార్చి 11న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్‌ మీడియాతో మాట్లాడాడు.

– మాది చిత్తూరు జిల్లా. పెరుమాళ్లపల్లి గ్రామం. ఫస్ట్‌ నేను హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేద్దామని అనుకున్నాను. మా ఇంట్లోవారు వద్దు అన్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వెళతానని చెప్పాను. ముందు డిగ్రీ పూర్తి చేయమన్నారు. డిగ్రీ కంప్లీట్‌ చేశాక ఇండస్ట్రీకి వచ్చాను. ఓ డిస్ట్రిబ్యూటర్‌ సహాయంతో ఇండస్ట్రీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా కెరీర్‌ను స్టార్ట్‌ చేశాను.

Kishore sreekaram director

– లవ్‌.కామ్, లక్ష్మీరావే మాఇంటికి వంటి సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. అప్పట్లో ఓ కన్నడ సినిమాకు కూడ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. ఆ తర్వాత కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్ చేశాను.

– 2016లో నేను తీసిన శ్రీకారం అనే షార్ట్‌ఫిల్మ్‌ చూసి ఇదొక సినిమా కంటెంట్‌ అని చాలామంది అన్నారు. ఆ తర్వాత 14 రీల్స్‌ ప్లస్‌లో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఓ పెద్ద ప్రొడక్షన్‌ హౌస్‌లో దర్శకుడిగా నా తొలి సినిమా ఉండటం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే నా ఫస్ట్‌ సినిమా ఫంక్షన్స్‌కు చిరంజీవిగారు, కేటీఆర్‌గారు రావడం చాలా హ్యాపీ.

– క్రికెట్, ప్రేమ లాంటి అంశాల మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాగే వ్యవసాయం మీద కూడా వచ్చాయి. కానీ మా సినిమాలో ఎవరు చెప్పని పాయింట్‌ను టచ్‌ చేశాం. ఈ పాయింట్‌కు ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతున్నారు. మా సినిమాను చూసేందుకు గ్రామాల నుండి ట్రాక్టర్స్‌లో థియేటర్స్‌కు వెళుతున్నారు. ఆడియన్స్‌ అంతా కనెక్ట్‌ అయ్యారు. ఎమోషన్స్‌ నా బలం అనుకుంటున్నాను.

– శర్వానంద్‌గారు అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ చేశారు. అలాగే రావురామేష్, సాయికుమార్, సీనియర్‌ నరేష్‌గార్ల క్యారెక్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. సత్య కామెడీ ట్రాక్‌ కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. ఈ సినిమా కోసం 40 ఎకరాల భూమిని తీసుకుని అందులో నిజంగా పంటలు పండించి, కొన్ని సన్నివేశాలను షూట్‌ చేశాం. ఇందుకు నిర్మాతలు రామ్‌ ఆచంటగారికి, గోపీ ఆచంట గారికి ధన్యవాదాలు. అలాగే హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ తన నటనతో మెప్పించింది.

– నా మొదటి సినిమా థియేటర్స్‌లోకి రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఏంటి? ఇంత సమయం పట్టింది అనుకున్నా. కానీ మా నిర్మాతలు తొలి సినిమాను తీసేందుకు దాదాపు 7 ఏళ్లు వెయిట్‌ చేశారని తెలిసి చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది.

– ఈ సినిమాను చూసి చాలా మంది ఫోన్‌ చేశారు. దర్శకులు హరీష్‌శంకర్, కృష్ణచైతన్య, సాగర్‌ కె చంద్ర ఇలా చాలా మంది యంగ్‌ డైరెక్టర్స్‌ ఫోన్‌ చేసిఅభినందించారు. అలాగే దర్శకులు అజయ్‌ భూపతి, బాబీ, గోపీచంద్‌ మలినేని శ్రీకారం సినిమాను మీడియా ముఖంగా అభినందించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.

– నా తర్వాత సినిమా యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ‘శ్రీకారం’ సినిమాకు కంప్లీట్‌ డిఫరెంట్‌. నాకు మైథాలాజికల్‌ సినిమాలు అంటే ఇష్టం. భవిష్యత్‌లో అలాంటి సినిమా చేస్తాను.