చెర్రీ, కృష్ణవంశీ కాంబినేషన్ లో ధృవ నక్షత్రం

Tuesday,September 06,2016 - 12:00 by Z_CLU

ప్రస్తుతం రామ్ చరణ్ ధృవ అనే సినిమా చేస్తున్నాడు. అటు కృష్ణవంశీ నక్షత్రం అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ ధృవనక్షత్రంగా మారింది. ఇదేదో వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న కొత్త సినిమా కాదు. రామ్ చరణ్, కృష్ణవంశీ మధ్య ఉన్న అనుబంధానికి గుర్తే ఈ ధృవనక్షత్రం. అవును… కృష్ణవంశీ డైరక్ట్ చేస్తున్న నక్షత్రం సినిమాకు చెర్రీ ప్రచారం కల్పించనున్నాడు. గతంలో తనకు గోవిందుడు అందరివాడేలే లాంటి హిట్ చిత్రాన్ని అందించిన కృష్ణవంశీపై అభిమానంతో చెర్రీ ఈ ప్రమోషన్ కు ఒప్పుకున్నాడు. ఇందులో మెగా హీరో సాయిధరమ్ తేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాబట్టి చెర్రీ ప్రచారానికి ఒప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావొచ్చు. ఫస్ట్ లుక్ ను విడుదల చేయడంతో పాటు కుదిరితే నక్షత్రం ఆడియో ఫంక్షన్ కు కూడా చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడీ కాంబినేషన్ ను సోషల్ మీడియాలో అంతా ధృవనక్షత్రం అని పిలుస్తున్నారు.