బాల దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి' రీమేక్

Tuesday,October 10,2017 - 01:01 by Z_CLU

తెలుగు సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా త్వరలోనే తమిళ్ లో రీమేక్ కానుంది. హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ఈ సినిమాతో కోలీవుడ్ కు ఇంట్రడ్యూస్ కాబోతున్నాడు. ఇప్పుడీ మూవీని డైరక్ట్ చేసేది ఎవరో తెలిసింది. గతంలో విక్రమ్ కు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బాల… అర్జున్ రెడ్డి రీమేక్ ను హ్యాండిల్ చేయబోతున్నాడు.

దర్శకుడు బాల, హీరో విక్రమ్ ది సూపర్ హిట్ కాంబినేషన్. విక్రమ్ నటించిన శేషు, శివపుత్రుడు సినిమాలకు బాల దర్శకత్వం వహించాడు. ఆ రెండూ విక్రమ్ కు జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలా తనకు తిరుగులేని ఇమేజ్ ఇచ్చిన బాల దర్శకత్వంలో తనయుడ్ని పరిశ్రమకు పరిచయం చేస్తున్నాడు విక్రమ్.

అర్జున్ రెడ్డి రీమేక్ ను స్వయంగా విక్రమ్ డైరక్ట్ చేయబోతున్నాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విక్రమ్.. తన దర్శకత్వంలో తనయుడ్ని వెండితెరకు పరిచయం చేసేకంటే.. తనకు కలిసొచ్చిన బాల దర్శకత్వంలో ధృవ్ ను ఇంట్రడ్యూస్ చేయడం బెటరని సెంటిమెంట్ గా ఫీలయ్యాడు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ రైట్స్ ను “ఈ-4 ఎంటర్ టైన్ మెంట్స్” సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థతో కలిసి విక్రమ్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది.