`పవర్`, `లింగా`, `బజరంగీ భాయీజాన్` వంటి భారీ చిత్రాల నిర్మాత రాక్లైన్ వెంకటేశ్ నిర్మిస్తోన్న తాజా చిత్రం `ఆటగదరా శివ`. రాక్లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్నారు. `ఆ నలుగురు`, `మధు మాసం`, `అందరి బంధువయ`తో ప్రేక్షకుల భావోద్వేగాలను స్పృశించిన సెన్సిటివ్ దర్శకుడు చంద్రసిద్ధార్థ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఉదయ్ శంకర్ కథానాయకుడు. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. `సమయానికి వచ్చేది దేవుడు కాదు… యముడు` అనే డైలాగ్తో మొదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
హీరో ఉదయ్శంకర్ మాట్లాడుతూ “ఉరిశిక్ష నుంచి తప్పించుకుని ఓ ఖైదీ బయటపడతాడు. అనుకోకుండా తనను ఉరితీయాల్సిన తలారినే కలుస్తాడు. వాళ్లెవరన్న విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తారు. ఆ ప్రయాణంలో వాళ్లకు ఎదురయ్యే అనుభవాలు ఏంటి? వాళ్లు ఎవరెవరిని కలిశారు? అనేది మా సినిమాలో ఆసక్తికరమైన అంశం. కథానాయకుడిగా నా తొలి చిత్రమిది. దొడ్డన్న కన్నడలో అగ్రనటుడు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంతో కథానాయకుడిగా నాకు చాలా మంచి పేరు వస్తుంది. భావోద్వేగాలను పండించడంలో చంద్రసిద్ధార్థ్ శైలి వేరు. ఆయన తీర్చిదిద్దిన ఈ సినిమా తెలుగులో ప్రత్యేకంగా నిలిచిపోతుంది“ అని చెప్పారు.
దర్శకుడు చంద్రసిద్ధార్థ్ మాట్లాడుతూ “శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఒకరి నొకరు కలిసినా, విడిపోయినా దాని వెనుకున్నది శివుడి లీలే అని నమ్ముతాం. ఆ తాత్వికతని స్పృశిస్తూ అల్లుకున్న కథ ఇది. కన్నడలో విజయవంతమైన `రామ రామ రే` చిత్రాన్ని ఆధారంగా తీసుకుని మన నేటివిటీకి తగ్గట్టు తీర్చిదిద్దా. జూలై 14న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం“ అని చెప్పారు.