‘Sharwanand’ Interview about ‘Sreekaram’

Wednesday,March 10,2021 - 07:07 by Z_CLU

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో నిర్మాతలు రామ్ఆచంట, గోపీఆచంట నిర్మించిన సినిమా 'శ్రీకారం'. మంచి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా మార్చి11న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా హీరో శ‌ర్వానంద్ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు శర్వా మాటల్లోనే...

పాయింట్  కొత్తగా అనిపించింది

ట్రైల‌ర్ చూపించిన‌ట్టు మన ముందు తరాలు వ్యవసాయంపైనే ఆధారపడ్డాయి. కానీ నేడు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రైతు కొడుకు రైతు కావడానికి ఇష్టపడటం లేదనే పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. ఇతర వ్యాపార రంగాల మాదిరిగానే వ్యవసాయం లాభసాటి అనేది ఎవరూ గుర్తించడం లేదనే పాయింట్స్‌ని ట‌చ్ చేస్తూ సినిమా సాగుతుంది.ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ చేస్తోన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టకుండా వ్యవసాయం ఎలా చేయవచ్చో ఈ సినిమాలో చూపించాం. ఊరందరూ కలిసి ఉమ్మడి సేధ్యం చేస్తే లాభాల్ని అందరూ సమంగా పంచుకోవచ్చు. ప్రభుత్వాలపై ఆధారపడకుండా తమ సమస్యల్ని తామే ఎలా పరిష్కరించుకోవచ్చని తెలిపే చిత్ర‌మిది.

Sreekaram_Movie_Stills_zeecinemalu

ఆలోచనను రేకెత్తిస్తాయి

ఇలాంటి సందేశాత్మక క‌థ‌ల‌ను క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఆడియెన్స్‌కి న‌చ్చేలా చెప్ప‌డం కత్తిమీదసాము లాంటింది. ముఖ్యంగా ఏదో ఉప‌న్యాసాలు చెబుతున్న‌ట్టు కాకుండా మేం ఏం చెప్పాల‌నుకున్నామో..ఆ పాయింట్‌కి మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్‌, ఎమోష‌న్స్‌ని క‌లిపి అంద‌రికీ అర్ధం అయ్యేలాగా, ఆమోదయోగ్యంగా చెప్పడానికి ట్రై చేశాం. రైతులకు సహాయం చేయడం ప్రతి ఒక్కరి విధిగా చూపించాం. రేపు సినిమా రిలీజ‌య్యాక ఈ ఆంశాలన్ని ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తిస్తాయి.

చక్కటి ప్రేమకథ

చిన్న‌ప్ప‌టి నుండి వ్యవసాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న యువకుడిగా నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. రైతుగా మారాలనే ఆలోచనతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని అతడు ఎందుకు వదులుకున్నాడు? ఈ క్రమంలో తండ్రి నుంచి అతడికి ఎలాంటి వ్యతిరేకత ఎదురైందనేది ఆకట్టుకుంటుంది. సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సెంటిమెంట్ మనసుల్ని కదిలిస్తుంది. రైతు సమస్యలు, సమకాలీన అంశాలను ఇందులో ప్రస్తావించడం లేదు. అంతర్లీనంగా చక్కటి ప్రేమకథ మిళితమై ఉంటుంది.

మూడు నెలలు అక్క‌డే ఉన్నా 

హైదరాబాద్ పరిసరాల్లో నాకో ఫామ్ హౌస్ ఉంది ఇదివరకు షూటింగ్ లతో బిజీగా ఉండటంతో అక్కడికి ఎక్కువగా వెళ్లే అవకాశం రాలేదు. లాక్‌డౌన్‌లో మూడు నెలలు అక్క‌డే ఉన్నా ఈ సమయంలో వ్యవసాయంపై ఇష్టం మొదలైంది. వ్యవసాయరంగంలో వస్తోన్న కొత్త విధానాలపై నాలో అవగాహన పెరిగింది. నాకు దాన్ని మించిన ఆనందం లేదు ఒక వేళ సినిమాలు ఏమీ లేవు అని అనుకుంటే త‌ప్ప‌కుండా వ్య‌వ‌సాయాన్ని నా వృత్తిగా ఎంచుకుంటాను. శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలో కంటూ ప్ర‌త్యేక‌మైన స‌న్నివేశాలు రాసిన సంద‌ర్భాలు లేవు. ఒక మంచి సందేశం నా ద్వారా క‌న్వే అయింది అంతే... ఇప్పుడు ఇలాంటి మంచి సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం బాధ్యతగా భావించి చేశా.

 

నా మీట‌ర్ కాదు

యాక్చువ‌ల్లి చెప్పాలంటే అది నా మీట‌ర్ కాదు.. కాని అంద‌రూ మీరు చేస్తే అదిరిపోతుంది అనే స‌రికి స‌రే అని చేశాను. పెంచ‌ల‌దాస్ గారు మంచి సాహిత్యం, గాత్రం అందించారు. శ‌త‌మానం త‌ర్వాత మిక్కీ మ‌రోసారి మంచి సంగీతాన్ని ఇచ్చారు. అలాగే రావు ర‌మేష్ గారితో 12 సంవ‌త్స‌రాల త‌ర్వాత మ‌ళ్లీ క‌లిసి న‌టించాను. న‌రేష్ గారితో కూడా చాలా కాలం త‌ర్వాత చేశాను. మంచి సినిమాలో అంద‌రం భాగ‌మైనందుకు హ్యాపీగా ఉంది.

Sharwanand Sreekaram Release March 11 zeecinemalu

సేఫ్ ప్రాజెక్ట్‌

ఇలాంటి క‌థ రాయ‌డం చాలా క‌ష్టం. దాన్ని క‌మ‌ర్షియ‌ల్‌గా చెప్ప‌డం ఇంకా క‌ష్టం. చిన్నా తేడా వ‌చ్చినా అరే ఆర్ట్ ఫిలిం అంటారు.. అలాంటివేం లేకుండా పూర్తి క‌మ‌ర్షియ‌ల్‌గా ఒక మంచి ల‌వ్‌ట్రాక్ అన్ని స‌మ‌కూర్చి డెఫినెట్ గా చాలా బాగా చేశాడు. ఈ సినిమా ఆయ‌న రియ‌ల్‌ స్టోరీనే..ముఖ్యంగా సినిమాఅంత బాగా రావ‌డానికి మా నిర్మాత‌లు బ్యాక్ బోన్‌గా నిల‌బ‌డ్డారు. దిల్‌రాజు గారు, యూవీ క్రియేష‌న్స్ త‌ర్వాత ఇలాంటి ప్రొడ్యూస‌ర్స్ ఉంటే అన్ని చూసుకుంటారు అనిపించింది. శ్రీ‌కారం సినిమా బ‌డ్జెట్‌లో చేశాం. సేఫ్ ప్రాజెక్ట్‌. అంద‌రం హ్యాపీ.

ప్ర‌భాస్ ఫోన్ చేశారు

చిరంజీవిగారు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈ సినిమా గురించి మాట్లాడితే ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుందనే నమ్మకంతోనే ప్రీ రిలీజ్ వేడుకకు వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాం. కేసీఆర్ కేటీఆర్ గారికి సినిమా ప్రత్యేకంగా చూపించే ప్లాన్‌లో ఉన్నాం. ప్ర‌భాస్ అన్న ఇంత‌కు ముందే ఫోన్ చేశారు. ట్రైల‌ర్‌,టీజ‌ర్ పంపించా..చూసి ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది.. నేను ట్వీట్ వేస్తాను అన్నారు.

 

మూడు సినిమాలు

ఈ ఏడాది నేను నటించిన మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' పూర్తి ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంటుంది. మహాసముద్రం' 80 శాతం షూటింగ్ పూర్తయింది. అలాగే తెలుగు, తమిళ భాషల్లో మరో సినిమా చేస్తున్నా, వీటితో పాటు తమిళంలో ఓ సినిమాను అంగీకరించా.