హీరోయిన్ పూజా హెగ్డేకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉంది. అయితే ఇలాంటి టైమ్ లో పూజా హెగ్డే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎగిరి గంతేస్తోంది. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని అంటోంది. ఇంతకీ ఏంటి సంగతి అనుకుంటున్నారా? ఆమెకు కరోనా తగ్గిపోయింది.
అవును.. తాజాగా టెస్ట్ చేస్తే పూజా హెగ్డేకు నెగెటివ్ వచ్చింది. దీంతో తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నానని చెప్పుకొచ్చింది ఈ బుట్టబొమ్మ. తనకు ఇంత త్వరగా కరోనా తగ్గిపోవడానికి, అందరి ప్రార్థనలే కారణమని చెప్పిన పూజ.. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. ఇకపై రెట్టించిన ఉత్సాహంతో సెట్స్ పైకి వస్తానని అంటోంది. ఈ సందర్భంగా తన లేటెస్ట్ ఫొటోను కూడా పోస్ట్ చేసింది.
ఏప్రిల్ 25న కరోనా బారిన పడింది పూజా హెగ్డే. ఓసారి ముంబయి వెళ్లి వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఓ షూటింగ్ లో పాల్గొంది. ఎక్కడ ఆమెకు వైరస్ ఎటాక్ అయిందనేది అంతుచిక్కలేదు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయింది.
హోం ఐసొలేషన్ లో ఉంటూ యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేసింది పూజా హెగ్డే. తనతో పాటు అంతా ప్రాణాయామం చేయాలంటూ ఓ లైవ్ సెషన్ కు కూడా పిలుపునిచ్చింది. ఆందోళన, భయం పోగొట్టుకోవడానికి మంచి పుస్తకాలు చదివింది. డాక్టర్లు చెప్పిన మందులు వేసుకుంటూ, మంచి ఆహారం తీసుకుంది. అలా 10 రోజుల్లోనే కరోనా నుంచి బయటపడింది.
త్వరలోనే సల్మాన్ ఖాన్ సరసన నటించబోతోంది ఈ ముద్దుగుమ్మ. దీంతో పాటు రణ్వీర్ సింగ్ సరసన కూడా ఓ సినిమా చేయబోతోంది. అటు తమిళ్ లో విజయ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఇక తెలుగులో ఆమె నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ కు రెడీ అయింది. ఆచార్య సినిమా సెట్స్ పై ఉంది. రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
stories, Gossips, Actress Photos and Special topics