అల్లు అర్జున్ -సుకుమార్ -దేవి కాంబినేషన్ లో వస్తున్న 'పుష్ప ది రైజ్' నుండి వచ్చిన ప్రతీ సాంగ్ మిలియన్ వ్యూస్ తో సూపర్ హిట్టయింది. ముఖ్యంగా "శ్రీవల్లి" సాంగ్ బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఆల్బం నుండో నాలుగో సాంగ్ రిలీజైంది. 'ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా' అంటూ సాగే ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మాస్ ఆడియన్స్ కి పూనకం తెప్పిస్తుంది.
తన ఎనర్జీనంతా మ్యూజిక్ లో పెట్టేసి ఆడియన్స్ కి అదిరిపోయే మాస్ సాంగ్ అందించాడు దేవి శ్రీ ప్రసాద్. సాంగ్ స్టార్టింగ్ నుండే గూస్ బంప్స్ తెప్పించేలా కంపోజ్ చేశాడు. లిరికల్ వీడియో చూస్తే పుష్ప రాజ్ ఊహించనిది దక్కించుకొని ఆ ఆనందంతో గర్వంగా పాడుకునే పాట అని అర్థమవుతుంది. ఈ పాటకి తన కలంతో మరింత బలం చేకూర్చాడు చంద్రబోస్. ముఖ్యంగా "నిను ఏట్లో యిసిరేస్తా .. నే సేపతో తిరిగొస్తా", "గడ కర్రతో గుచ్చేస్తా... నే జెండాలా ఎగిరేస్తా", "నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా...నేను ఖరీదైన ఖనిజం లా మళ్ళీ దొరికేస్తా" అనే లైన్స్ సాంగ్ ని బాగా ఎలివేట్ చేశాయి. అలాగే నకాజ్ అజిజ్ సింగింగ్ కూడా సాంగ్ కి ప్లస్ పాయింట్.
ఓవరాల్ గా 'పుష్ప ది రైజ్' ఆల్బం నుండి రిలీజైన ఈ సాంగ్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ మాస్ సాంగ్స్ లో మంచి స్థానం దక్కించుకోవడం ఖాయమనిపిస్తుంది. విడుదలైన తక్కువ టైంలోనే భారీ వ్యూస్ కొల్లగొట్టిన ఈ సాంగ్ ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యెర్నేని , రవి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తుండగా ఫహాద్ ఫాసిల్, సునీల్ విలన్స్ గా నటిస్తున్నారు. రావు రమేష్ , అనసూయ , జగదీశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics