Dil Raju Harish Shankar Team up for a web series for ZEE5

Thursday,January 27,2022 - 07:47 by Z_CLU

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఇప్పుడు ఈ కాంబోలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. హరీష్ శంకర్ కథతో చంద్ర మోహన్ డైరెక్షన్ లో 'ATM ' అనే వెబ్ సిరీస్ వస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్ బేనర్ పై శిరీష్ సమర్పణలో నిర్మించబోయే ఈ సిరీస్ కి హర్షిత్ రెడ్డి , హన్సిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సిరీస్ ను ఇటివలే లాంచ్ చేశారు. త్వరలోనే షూటింగ్ జరుపుకోనున్న ATM జీ5 స్ట్రీమ్ అవ్వనుంది. తొలిసారి దిల్ రాజు సంస్థలో రానున్న ఈ సిరీస్ పై లాంచ్ నుండే ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు మేకర్స్. గ్రాండ్ గా ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేశారు.

ఇది తమ బేనర్ లో వేస్తున్న తొలి అడుగని ఇకపై OTT కోసం కంటెంట్ రెడీ చేస్తూ కొత్తవారికి అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించారు. OTT కంటెంట్ బాధ్యతతో పాటు చిన్న సినిమాల నిర్మాణ పనులన్నీ హర్షిత్ రెడ్డి , హన్సిత ఇద్దరూ కలిసి చూసుకుంటారని తెలియజేశారు. ఇప్పటి వరకూ వెబ్ సిరీస్ అంటే థ్రిల్ చేయడం , భయపెట్టడం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ తీస్తున్నారని కానీ తాము OTT ఆడియన్స్ కి థ్రిల్ తో పాటు హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ATM చేయబోతున్నామని చెప్పుకున్నాడు. ఎప్పటి నుండి వెబ్ సిరీస్ చేయాలని అనుకుంటున్నానని కానీ ఫైనల్ గా ఒక మంచి ఐడియా రావడంతో ఈ స్క్రిప్ట్ రాశానని దాన్ని దర్శకుడు చంద్ర మోహన్ తన టీంతో కలిసి మెరుగులు దిద్ది ఇంకా బాగా వర్కౌట్ చేశారని అన్నారు.

ఏదేమైనా తొలిసారి దిల్ రాజు బేనర్ నుండి ఓ వెబ్ సిరీస్ వస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై బజ్ నెలకొంటుంది. త్వరలోనే ZEE5 లో రాబోయే ఈ సిరీస్ సూపర్ హిట్ అవ్వడం ఖాయమని టీం గట్టిగా నమ్ముతున్నారు.