మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన 'న్యాయం కావాలి' సినిమాకు నేటితో నలబై ఏళ్లు పూర్తయ్యాయి. 1981 మే 15న విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం అందుకొని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఓ అబల తనకి జరిగిన అన్యాయం గురించి కేసు పెట్టి న్యాయం కోరుకునే కథతో తెరకెక్కిన ఈ సినిమాలో కోర్ట్ రూమ్ సన్నివేశాలు హైలైట్ అని చెప్పొచ్చు.
డి.కామేశ్వరి రాసిన 'కొత్తమలుపు' అనే కథ ఆదరంగా తెరకెక్కిన ఈ సినిమాకు కోదండరామిరెడ్డి దర్శకుడు. క్రాంతి చిత్ర బేనర్ పై నిర్మాత క్రాంతి కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రాధిక హీరోయిన్ గా నటించింది. శారద, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, పుష్పలత, ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రలు పోషించారు. ఇక నిర్మాత కథ చెప్పగానే దాసరి ఇందులో ఓ అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
నటుడిగా 29 సినిమాలు చేసిన చిరుకి 30వ సినిమాగా 'న్యాయం కావాలి' తెరకెక్కింది. ఇక తన సక్సెస్ ఫుల్ గ్రాఫ్ తో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన కోదండ రామిరెడ్డి కి ఇది రెండో సినిమా. మొదటి సినిమా 'సంధ్య' తో మంచి విజయం అందుకున్నకోదండరామిరెడ్డి కి ఈ చిత్రం దర్శకుడిగా మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చింది. చిరు-కోందండ రామిరెడ్డి కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ఇది. సినిమాలో కోర్టు రూమ్ డ్రామా చాలా సేపు ఉన్నా ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి సన్నివేశాలతో తెరకెక్కించి విజయం అందుకున్నాడు కోదండరామిరెడ్డి.
సత్యానంద్ మాటలు అందించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. వేటూరి సాహిత్యం అందించారు. ఇందులో ఎన్టీఆర్ 'వేటగాడు' సినిమాలోని '""ఆకు చాటు పిండే తడిసే" అనే పాటను సందర్భాను సారంగా ఉపయోగించారు. ఆ పాట కోసం ప్రేక్షకులు సినిమా చూడటానికి క్యూ కట్టారు. చిరంజీవి -కోదండరామిరెడ్డి -క్రాంతి కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద హిట్.
- Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics