ఈరోజు తన 42వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు చిరంజీవి. Chiranjeevi Wedding Anniversaryని మెగా కాంపౌండ్ తో పాటు మెగాభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా 42 ఏళ్ల కిందట జరిగిన "చిరు పెళ్లి చూపుల" గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
తను సురేఖను ఫస్ట్ టైమ్ చూసిన స్వీట్ మెమొరీని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. అయితే అది పెళ్లిచూపుల్లో కాదు, పెళ్లిచూపుల కంటే ముందే సురేఖను చూడడం, ఆమె చేతితో కాఫీ అందుకోవడం జరిగిపోయాయంటూ, గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మెగాస్టార్.
» నేను చెన్నైలో కోడంబాకం బ్రిడ్జిపై నా కారులో వెళ్తుంటే, నా క్లాస్ మేట్ సత్యనారాయణ కనిపించాడు. వెంటనే కారు ఎక్కించుకున్నాడు. నా ఫ్రెండ్ సత్యనారాయణకు అల్లు రామలింగయ్య పెదనాన్న అవుతారు. వాళ్ల ఇంటికే వెళ్తున్నాడు. ఎలాగూ వచ్చావు కదా లోపలికి రమ్మని పిలిచాడు.
» అలా అల్లు రామలింగయ్యగారి ఇంట్లోకి తొలిసారి అడుగుపెట్టాను. కాకపోతే ఆరోజు ఆయన ఇంట్లో లేరు. ఆరోజు సురేఖే కాఫీ పెట్టింది. అలా నేను సురేఖను తొలిసారి చూశాను. లాక్ అయిపోయాను. అయితే సురేఖ నన్ను చూడడం ఫస్ట్ టైమ్ కాదు. అప్పటికే మనవూరి పాండవులు సినిమాలో నన్ను చూసింది. నేరుగా చూడడం మాత్రం ఆరోజే.
ఆ తర్వాత స్వయంగా అల్లు రామలింగయ్యగారి దృష్టిలో చిరంజీవి పడడం, అల్లు అరవింద్ సహకారంతో చిరు గురించి వాకబు చేయడం, పెళ్లి చేయడం చకచకా జరిగిపోయాయి.