‘Republic’ Movie Review

Friday,October 01,2021 - 02:17 by Z_CLU

న‌టీన‌టులు : సాయితేజ్, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, ర‌మ్య‌కృష్ణ‌, సుబ్బ‌రాజు, రాహుల్ రామ‌కృష్ణ‌,బాక్స‌ర్ దిన తదితరులు.

సినిమాటోగ్ర‌ఫీ :  ఎం.సుకుమార్‌

మ్యూజిక్‌ :  మ‌ణిశ‌ర్మ‌

స్క్రీన్‌ప్లే :  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌

నిర్మాత‌లు : జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

క‌థ‌- మాట‌లు- ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా

నిడివి : 152 నిమిషాలు

విడుదల తేది : 1 అక్టోబర్ 2021

 

సాయి తేజ్, దేవకట్టా కాంబోలో సోషల్ డ్రామాతో సినిమా తెరకెక్కనుందని తెలిసిన రోజు నుండే 'రిపబ్లిక్' పై అంచనాలు పెరిగాయి. మరి పొలిటికల్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

 

కథ :

చిన్నతనం నుండే ప్రభుత్వ ఉద్యోగి(జగపతిబాబు) అయిన తన అవినీతి పరుడని  తెలుసుకున్న కొడుకు పంజా అభిరామ్(సాయి తేజ్)  కళ్ళ ముందు జరిగే అన్యాయాన్ని సహించక ప్రశ్నించేలా పెరిగి పెద్దవుతాడు. ఉన్నత చదువులు చదివి యుఎస్ వెళ్లాలనే లక్ష్యంతో ఉంటాడు. కానీ కొన్ని సంఘటన కారణం చేత అభిరాం అమెరికా ప్లాన్ మార్చుకొని ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఇంటర్వ్యూ లో ఫెయిల్ అయ్యాడనుకున్న అభిరామ్ ఊహించని విధంగా కృష్ణా జిల్లాకు కలెక్టర్ గా వస్తాడు. అలా కలెక్టర్ గా మారిన అభి అక్కడ స్థానిక రాజకీయ నాయకురాలు విశాఖ వాణి(రమ్యకృష్ణ)కి ఎదురెళతాడు. ఇంతకీ విశాక వాణి కి అభి కి మధ్య జరిగిన రాజకీయ యుద్ధంలో ఎవరు గెలిచారు ? చివరికి కలెక్టర్ గా మారిన అభి అక్కడ స్థానిక సమస్యపై ప్రజలకు ఎలా అండగా నిలిచాడనేది మిగతా కథ.

నటీ నటుల పనితీరు :

అభిరామ్ పాత్రకి సాయి తేజ్ బెస్ట్ ఇచ్చాడు. తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొని సినిమాకు హైలైట్ గా నిలిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో నటుడిగా మంచి మార్కులు సొంతం చేసుకున్నాడు. తన డైలాగ్ డెలివరీ తో పొలిటికల్ సీన్స్ కి మరింత పవర్ తీసుకొచ్చాడు. NRI గర్ల్ మైరా పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటన బాగుంది. ఆ పాత్రకు తన నటనతో న్యాయం చేసింది. రాజకీయ నాయకురాలు విశాఖ వాణి పాత్రకు రమ్య కృష్ణ పర్ఫెక్ట్ అనిపించుకొని సినిమాకు బలం చేకూర్చింది. దశరథ్ పాత్రలో జగపతి ఒదిగిపోయాడు. ముఖ్యంగా కొడుకుతో మాట్లాడే ఎమోషనల్ సీన్ లో కన్నీళ్లు తెప్పించాడు.

విలన్ గుణ పాత్రలో సాయి దీన బాగా నటించాడు. తల్లి పాత్రలో సురేఖ వాణి, పోలీస్ ఆఫీసర్ గా శ్రీకాంత్ అయ్యంగార్ , జడ్జ్ గా CL నరసింహ, ఆటో మణి గా రాహుల్ రామకృష్ణ హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు , ఆమని మిగతా తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం పనితీరు :

సినిమాకు మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే పవర్ ఫుల్ సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది. పాటలు మాత్రం ఫరవాలేదనిపించాయి తప్ప మళ్ళీ మళ్ళీ పాడుకునే రీతిలో లేవు. కెమెరా మెన్ సుకుమార్‌ అందించిన విజువల్స్ బాగున్నాయి. కొన్ని సన్నివేశాల్లో అతని కెమెరా పనితనం కనిపిస్తుంది. కె.ఎల్‌.ప్ర‌వీణ్ ఎడిటింగ్ బాగుంది. పర్ఫెక్ట్ టైమింగ్ తో  సినిమాను కట్ చేశాడు. స్టంట్స్ మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి.

కొన్ని సందర్భాల్లో వచ్చే పవర్ ఫుల్ డైలాగ్స్ క్లాప్స్ కొట్టించేలా ఉన్నాయి. దేవకట్టా ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కానీ కథనం అక్కడక్కడా నెమ్మదిగా సాగుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

 

జీ సినిమాలు సమీక్ష :

కొన్ని కథలు డీల్ చేయడం చాలా కష్టం. అలాంటి కష్టమైన కథను ఎంచుకొని ఈ సినిమా తీశాడు దేవకట్టా. టీజర్ , ట్రైలర్ చూస్తే ఇది కంప్లీట్ పొలిటికల్ డ్రామా అనిపిస్తుంది. కానీ సినిమాలో చాలా విషయాలు టచ్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా రాజకీయ ముసుగులో జరిగే అన్యాయాలను చూపిస్తూ ఓ స్ట్రాంగ్ పాయింట్ కూడా టచ్ చేశాడు. తెల్లేరు మంచి నీటి సరస్సు దాని చుట్టూ జరిగే ఆక్వా వ్యాపారం అనే పాయింట్ పై ఎక్కువ శాతం కథను నడిపించాడు దేవకట్టా. నిజానికి ఈ పాయింట్ ని టచ్ చేసి దాని చుట్టూ పొలిటికల్ లేయర్ అల్లడం కష్టమే. కాకపోతే తను నమ్మిన కథని హానెస్ట్ గా తీసే ప్రయత్నం చేశాడు.

IAS ఆఫీసర్ ఎంత బాధ్యతగా ఉండాలి , అలాగే తన కింద పనిచేసే వారిని ఎలా సక్రమమైన దారిలో నడిపించాలి అనే విషయాలు కూడా చూపిస్తూ హీరో క్యారెక్టరైజేషణ్ ని డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. ఎంతో నచ్చిన కథ , పాత్ర కావడంతో సాయి తేజ్ సినిమాను ఓన్ చేసుకొని నటించాడు. అందుకే స్క్రీన్ పై సాయి తేజ్ కనబడకుండా అభిరామ్ కనిపిస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఈసారి తన నటనకి మరింత పదును పెట్టి మెప్పించాడు. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు హీరోగా తేజ్ ని అభినందించాలి. ఎందుకనేది సినిమా ఎండింగ్ చూస్తే అర్థమవుతుంది.

అవినీతి పరుడైన తండ్రిని చూస్తూ అతనికి విరుద్దంగా పెరిగే కుర్రాడి సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఆ కుర్రాడు పెరిగి పెద్దయి సమాజంలో అవినీతిపై ఎలా ఎదురుతిరిగాడు..? రాజకీయ నాయకులపై , గవర్న్ మెంట్ ఆఫీసర్స్ పై ఎదురుతిరిగి కలెక్టర్ గా ఎలా మారాడు ? అనే ఎలిమెంట్ తో ఫస్ట్ హాఫ్ ని నడిపించాడు. ఇక సెకండాఫ్ మాత్రం ఎమోషనల్ గా రాసుకొని ఆ సనివేశాలతో మెప్పించాడు దర్శకుడు. ముఖ్యంగా చాలా విషయాలు చర్చించి డైలాగ్స్ తో క్లాప్స్ కొట్టించాడు. అలాగే బలమైన పాత్రలు రాసుకొని దానికి సరైన నటీ నటులను ఎంచుకున్నాడు. ముఖ్యంగా రమ్య కృష్ణ , జగపతి బాబు లను విశాఖ వాణి , దశరథ్ పాత్రలకు తీసుకొని ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అలాగే హీరో తండ్రి అవినీతి పరుడుగా ఎందుకు మారాడు అనే విషయంపై ఆడియన్స్ కి ఉన్న డౌట్ కి సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ తో ఆన్సర్ ఇచ్చాడు. కాకపోతే ఎవరూ ఊహించని విధంగా షాకిచ్చే క్లైమాక్స్ తో సినిమాను ఎండ్ చేశాడు దేవకట్టా. అదేంటనేది సినిమా చూస్తే తెలుస్తుంది.  అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం మాత్రం కాస్త బోర్ కొట్టిస్తుంది. ఓవరాల్ గా తెల్లేరు సరస్సు దాని చుట్టూ జరిగే అన్యాయంతో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన 'రిపబ్లిక్' ఆకట్టుకుంటుంది.

రేటింగ్ : 3 /5